మాకుంది మూరెడు.. ఇదికూడా లేకుండా చేసి మా పొట్టలు కొట్టకండయ్యా.. అంటూ రైతులు గగ్గోలు పెట్టారు.
రూపెనగుంట్ల(నకరికల్లు) : మాకుంది మూరెడు.. ఇదికూడా లేకుండా చేసి మా పొట్టలు కొట్టకండయ్యా.. అంటూ రైతులు గగ్గోలు పెట్టారు. మండలంలోని రూపెనగుంట్ల గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువు ఆక్రమణలకు తొలగించే కార్యక్రమానికి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. పట్టాలు ఉన్న తమ భూములను సైతం ఆక్రమణలంటూ తొలగిస్తున్నారంటూ సాగురైతులు పెద్దసంఖ్యలో అక్కడి చేరుకున్నారు. దీంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఉద్రిక్త వాతావరణం మధ్య సభాపతి అక్కడకు చేరుకుని చెరువు పూడికతీత పనులకు శంకుస్థాపన చేశారు. పొక్లెయిన్తో ముళ్లపొదలు తొలగించారు. ముందుగా చెరువు సమీపంలో సాగుభూములను పరిశీలించారు.
పట్టాలు ఉన్నవారికి న్యాయం చేస్తాం...
తాము 40 ఏళ్లుగా తలా 30 సెంట్లు, నలభై సెంట్లు సాగుచేసుకుంటున్నామని, తమ పొట్టలు కొట్టొద్దంటూ బాధితులు వేడుకున్నారు. పట్టాలున్న వారికి న్యాయం చేస్తామని తహశీల్దార్ ఎన్వీ ప్రసాద్ చెప్పారు.