పారదర్శకంగా నిత్యావసర సరుకుల పంపిణీ
మంత్రులు బుగ్గన, కొడాలి, రంగనాథరాజు
సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): నాణ్యమైన నిత్యావసరాలను పారదర్శకంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కొడాలి నాని, సీహెచ్ రంగనాథరాజు చెప్పారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేసే మొబైల్ వాహనాలపై డెమో ప్రదర్శించారు.
ఈ వాహనాల్లో ఏర్పాట్లు, సదుపాయాలను ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ మంత్రులకు వివరించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ పారదర్శకమైన ప్రజా పంపిణీ వ్యవస్థ సంక్షేమ రాజ్య స్థాపనకు వెన్నెముకగా నిలుస్తుందనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ విశ్వాసమని చెప్పారు. వాహనాలను క్షేత్రస్థాయిలో డెమోగా నడిపి లోటుపాట్లు గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఎం.కాంతారావు, పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తదితరులు పాల్గొన్నారు.