మిడ్‌డే మీల్స్‌ వివాదం.. పీఎస్‌లో పంచాయితీ..! | Complaints Of Parents Committee Against Vizianagaram Model School Lunch Organizers | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజన వివాదం.. పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ..!

Oct 23 2019 7:09 AM | Updated on Oct 23 2019 8:22 AM

Complaints Of Parents Committee Against Vizianagaram Model School Lunch Organizers - Sakshi

వాగ్వివాదాల మధ్య మోడల్‌ స్కూల్‌ పేరెంట్స్‌ కమిటీ సభ్యులు, భోజన నిర్వాహకులు 

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా వండి విద్యార్థులకు అందించాల్సిన వంట నిర్వాహకులు కొద్ది రోజులుగా అరకొరగా వంటలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులు పాల్జేస్తున్నారు. దీన్ని కొద్ది రోజులుగా గమనిస్తూ వస్తున్న తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మంగళవారం నిర్వాహకులను నిలదీశారు. మాటమాట పెరిగి ఈ వివాదం కాస్త పోలీస్‌స్టేషన్‌కు చేరింది.  

సాక్షి, విజయనగరం అర్బన్‌: విజయనగరం మోడల్‌ స్కూల్‌ భోజన నిర్వాహకులపై పేరెంట్స్‌ కమిటీ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం వారి మధ్య వివాదం పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణ శివారుల్లోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో మధ్యాహ్న భోజన నిర్వాహణ సక్రమంగా లేదని ఆ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ కొద్దిరోజుల క్రితం గుర్తించింది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం వండటం లేదని  ఈ విషయంపై గత కొద్ది రోజులుగా భోజన నిర్వాహకులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఆ సందర్భంగానే వారి మధ్య మాటల వివాదం చోటుచేసుకంది. మధ్యాహ్నం భోజన వంటకాలు సరిపడక పోవడాన్ని కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా చూశారు. కమిటీ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు  2 గంటల సమయంలో భోజనం అందని విద్యార్థులకు తిరిగి వంట చేయించారు. ప్రతి రోజూ కనీసం పది కేజీల బియ్యాన్ని మిగిల్చడం వల్లే వంటకాలు చాలడం లేదని కమిటీ చైర్మన్‌ రాంబాబు, వైస్‌చైర్మన్‌ స్వాతి భోజన నిర్వాహకులను నిలదీశారు.

కమిటీ ఆధిపత్యాన్ని జీర్జించుకోని భోజన నిర్వాకురాలు శ్యామల,  స్రవంతి,  భర్త  సంతోష్‌ వారితో వాగి్వవాదానికి దిగారు.  ఈ సంఘటన జరిగిన సమయంలో ఉన్న పాఠశాల ప్రిన్సిపాల్‌ అప్పాజీ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రతి రోజూ చెబుతున్నారని తెలిపారు. విద్యార్థులకు సరిపడినంత వంటకాలు వండకుండా బియ్యం, గుడ్లు మిగుల్చుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. కమిటీ చెప్పిన మాటలు పట్టించుకోకుండా నిర్వాహకులు మంగళవారం కూడా విద్యార్థుల సంఖ్యకు సరిపడా వండకపోవడంతో కమిటీ సభ్యులు నిలదీశారని వివరించారు. మాటల యుద్ధంతో జరిగిన ఈ వివాదం ముదిరి టూ టౌన్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఇరువురి వాదన విన్న పోలీసులు సర్ది చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా భోజనం ఒకే సారి వండి బోధన సమయానికి అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement