ఇసుక సగటు వినియోగం 65 వేల టన్నులు
ఇది ప్రస్తుత సాధారణ వినియోగం మాత్రమే
బల్క్ బుకింగులు అదనం
ఆన్లైన్ బుకింగ్ గణాంకాల వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో ఇసుక రోజుకు సగటు వినియోగం 65 వేల టన్నులు పైగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆన్లైన్ బుకింగ్ గణాంకాలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది. ఏడాది మొత్తమ్మీద చూస్తే రోజుకు సగటు వినియోగం 80 – 85 వేల టన్నులు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మందగమన పరిస్థితుల వల్ల నిర్మాణరంగంలో పనులు తగ్గాయి.
వేసవితో పోల్చితే వర్షాకాలంలో నిర్మాణ పనులు మరింత తక్కువగా ఉంటాయి. ఈ ప్రభావం ఇసుక వినియోగంపైనా ఉంటుంది. ఇవి రిటైల్ ఇసుక వినియోగానికి సంబంధించిన గణాంకాలు మాత్రమే. ఇసుక బల్క్ బుకింగ్ గణాంకాలను ఇందులో లెక్కలోకి తీసుకోలేదు.
భారీగా పెరిగిన ఇసుక సరఫరా
రీచ్ల నుంచి స్టాక్ యార్డుల్లోకి ఇసుక తరలింపు భారీగా పెరిగింది. ప్రస్తుతం స్టాక్ యార్డుల్లో 2.95 లక్షల టన్నుల ఇసుక బుకింగ్లకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 62,125 టన్నుల ఇసుక బుకింగ్స్ జరిగాయి.
సంబంధిత వార్తలు