ఏపీజీబీ నుంచి రూ.7,877 కోట్ల రుణాలు | Sakshi
Sakshi News home page

ఏపీజీబీ నుంచి రూ.7,877 కోట్ల రుణాలు

Published Sun, Nov 2 2014 3:09 AM

Andhra Pragati rural bank from Rs .7,877 crore loans

చైర్మన్ సంపత్‌కుమారాచార్య
మార్కాపురం : ఆంధ్రాప్రగతి గ్రామీణ బ్యాంకు నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 30 నాటికి 5 జిల్లాల్లో రూ.7,877 కోట్ల రుణాలు ఇచ్చినట్లు బ్యాంకు చైర్మన్ డి.సంపత్‌కుమారాచార్య తెలిపారు. శనివారం స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.6,650 కోట్ల డిపాజిట్లు కూడా సేకరించినట్లు చెప్పారు. జన్‌ధన్ బీమా యోజన కింద ఇప్పటి వరకు 2.25 లక్షల ఖాతాలు ప్రారంభించామన్నారు. ఖాతాదారులకు ఏటీఎం కార్డులు ఇస్తున్నామన్నారు. రైతులకు కిసాన్ రూపే కార్డులు, సాధారణ ఖాతాదారులకు రూపే కార్డులు ఇస్తున్నామని, వీటిని ఖాతాదారులు దేశంలోని ఏ బ్యాంకు ఏటీఎంలలోనైనా ఉపయోగించుకోవచ్చని వివరించారు.

షాపింగ్ కూడా చేయవచ్చన్నారు. నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ సిస్టం ద్వారా ఇతర బ్యాంకుల నుంచి ఏపీజీబీ ద్వారా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది నూతనంగా రైతుల కోసం వ్యవసాయ పెట్టుబడులు అందిస్తున్నట్లు తెలిపారు. రుణ పరిమితి లేదని, ట్రాక్టర్లు,ఆధునిక వ్యవసాయ పనిముట్లు కూడా అందిస్తామన్నారు. వైద్యశాలల్లో అధునాతన పరికరాల కోసం రూ.50 లక్షల వరకు వైద్యులకు రుణాలు అందిస్తామని చెప్పారు.

మార్కాపురం, గిద్దలూరులో బ్రాంచి రెండో శాఖను త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఐదు ఏపీజీబీ బ్యాంకు శాఖలకు ఇటీవలే నాబార్డు బెస్ట్ బ్యాంక్ అవార్డు ఇచ్చిందని సంపత్‌కుమారాచార్య వివరించారు. రీజనల్ మేనేజర్ రాజశేఖరరెడ్డి, చీఫ్ మేనేజర్ ఓబయ్య, బ్రాంచి మేనేజర్ రాజారావు పాల్గొన్నారు. అనంతరం ఐదు జిల్లాల బ్రాంచి మేనేజర్లతో చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Advertisement
Advertisement