-
ప్రతి అక్రమ అరెస్టుకు ప్రతిఫలం అనుభవిస్తారు: మార్గాని భరత్
తాడేపల్లి: ఎన్నికల సమయంలో హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. వేధింపులే లక్ష్యంగా అరెస్టుల పర్వం కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. రెడ్బుక్ పేరుతో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లని సైతం వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దెబ్బకి పారిశ్రామిక వేత్తలు కూడా ఏపీ నుండి పరారవుతున్నారని భరత్ స్పష్టం చేశారు. ''చంద్రబాబు గత పాలనలో భారీగా లిక్కర్ స్కాం జరిగింది. రూ.5 వేల కోట్లకు పైగా నిధులను కొల్లగొట్టారు. ఆ కేసులో చంద్రబాబు నిందితుడు. కానీ జగన్ ప్రభుత్వంలో రూ.24 వేల కోట్ల ఆదాయం వచ్చింది. జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరిగి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వచ్చింది?'' అని మార్గాని భరత్ ప్రశ్నించారు.‘ఇప్పుడు చంద్రబాబు పాలనలో మళ్ళీ తమ మనుషులకు దోచి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ను మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు. వాట్సప్లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పర్మిట్ రూములు పెట్టి అమ్ముతున్నారు. మరి ఇంత చేసినా ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు రావటం లేదు?, ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?, దీనిని డైవర్షన్ చేసేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారు’ అని భరత్ వివరించారు.చంద్రబాబు.. జగన్ చుట్టూ ఉన్న వారిని టార్గెట్ చేశారు. నిజాయితీ కలిగిన అధికారులను పక్కన పెట్టి తమకు కావాల్సిన వారిని సిట్లో వేశారు. వారి ద్వారానే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఇప్పుడు చేస్తున్న ప్రతి అక్రమ అరెస్టుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రతిఫలం అనుభవిస్తారు’ అని భరత్ హెచ్చరించారు.రాష్ట్రంలో ఏ పంటకూ సరైన ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అక్రమ కేసులు ఆపి, ముందు రైతాంగానికి మేలు చేయండి. దావోస్ వెళ్ళి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకు రాలేక పోయారు. జిందాల్ ఏపీ నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఇవి మాత్రమే కాకుండా.. జైళ్లలో అధికారులను కూడా ఉన్నపళంగా బదిలీలు చేయటం వెనుక కారణం ఏంటి?, జైళ్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని భరత్ వెల్లడించారు. -
‘చంద్రబాబు.. లిక్కర్ స్కామ్కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’
తాడేపల్లి: నాణ్యమైన మద్యం, తక్కువ ధరలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాన్ని మోసం చేశారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. విమర్శించారు. దేశంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు కూటమి ప్రభుత్వం పెట్టింది పేరని ఎద్దేవా చేశారు శైలజానాథ్,ఈ రోజు(శనివారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. మద్యం వ్యాపారంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్. అని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు చేసిన అన్ని వ్యవహారాలు ప్రజలు మర్చిపోతారనే భావనలో ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే డిస్టలరీలకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వ్యవహారం గురువింది గింజ సమేతలా ఉంటుంది. నూతన పాలసీ విధానంలో మద్యం అమ్మకాలు ప్రైవేటుకి ఇవ్వడంలో కూడా అవకతవకలు జరిగాయి. టీడీపీ స్థానిక నాయకులకు భాగస్వామ్యం ఉంది. రండి చూపిస్తాం... బెల్ట్ షాప్ లు లేని గ్రామం లేదు.. మేము చూపిస్తాం. అసలు మద్యం స్కాం అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం లోనే నడుస్తోంది. మీ ప్రభుత్వ హయాంలో రోజు రెవెన్యూ లోటు కనిపిస్తుంది.మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు?, లిక్కర్ కేసులో ఉన్న ఆధారాలు ఏంటి?, భయాన్ని క్రియట్ చేసి రాజ్యం నడుపుదాం అనుకుంటున్నారా?, చంద్రబాబు ఎన్నికల్లో గెలుపుకోసం ఏమైనా ప్రకటనలు చేస్తారని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగించాలి. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు?, ఇప్పటికైనా కక్ష పూరిత వేధింపులు ఆపండి. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. మీ సీనియర్లతో చర్చించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోండి. మీ సచ్చీలతను నిరూపించుకోండి. చంద్రబాబు.. లిక్కర్ స్కామ్ కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’ అంటూ ధ్వజమెత్తారు శైలజానాథ్. -
‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు’
నెల్లూరు: పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. హామీల అమలును గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. మద్యాన్ని మాత్రాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిల అరెస్ట్ దుర్మార్గం. గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విషయాన్ని లిక్కర్ స్కాంగా మార్చారు. జరగని లిక్కర్ స్కామ్ని జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఈ కేసులో నేతలతో పాటు సీనియర్ అధికారులకు ఇరికించారు.చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ధ్వజమెత్తారు చంద్రశేఖర్ రెడ్డి. -
ఆ అరెస్ట్ల వెనుక కుట్ర కోణం: అంబటి
సాక్షి, గుంటూరు: కేసులు పెట్టి అరెస్ట్లు చేస్తే బెదిరిపోయేది లేదని.. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు.‘‘రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పని చేశారని ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్రెడ్డిలను అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్ను అక్రమ కేసులతో జైలులో పెట్టి, ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైఎస్సార్సీపీ నేతలను, గత ప్రభుత్వ హయాంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారు. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుంది. అమ్మ ఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్ట్లు’
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక, హామీలు అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.హామీల అమలు విషయంలో అన్నివర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు.వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి, మద్యం షాపులు తగ్గించి, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతులిచ్చాడని, గత వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. గత మా వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. వీధివీధినా బెల్ట్ షాపులు తెరిచి 24 గంటలూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి దమ్ముంటే తన మీద నమోదైన ఇన్నర్ రింగ్రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని, ఐఏఎస్, ఐపీఎస్లనే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అరాచక పాలనతో ఎంతోకాలం ప్రజాచైతన్యాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
‘సకల శాఖలకు మంత్రి లోకేష్.. అందుకే పవన్కు మోదీ చాక్లెట్’
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. రాష్ట్రంలో సకల శాఖల మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగ సాక్షాలు.. అబద్ధపు స్టేట్మెంట్స్తో ఈ అరెస్ట్ జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉంది. సోలార్ ప్రాజెక్టులను ఏపీలో విస్తారంగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్దే. వైఎస్సార్సీపీ తెచ్చిన సోలార్ ప్రాజెక్టులను తాను తెచ్చినట్లు నారా లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ పాలనలో 22వేల కోట్ల రూపాయల విలువైన సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగానే రెన్యూ సంస్థ ఏపీలో పెట్టుబడులు. ఏపీలో నారా లోకేష్ సకల శాఖ మంత్రి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను మంత్రి లోకేష్ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు?. ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలను ఎలుకలు కొరికినా స్పందించలేదు. రెండు రోజుల అనంత పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం.రాష్ట్రంలో 32వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. డిప్యూటీ సీఎం పదవి వచ్చాక అదృశ్యమైన మహిళల వ్యవహారంపై పవన్ ఎందుకు మాట్లాడరు. పవన్ కళ్యాణ్.. పిఠాపురం పీఠాధిపతి. అందుకే ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. -
చంద్రబాబు కుట్ర ఇదే: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీని నాశనం చేయాలని, వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్సార్సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు...గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాదించుకున్నారు...తప్పుడు ఆరోపణలతో వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారి చిత్తశుద్దితో పనిచేస్తారు? ఎక్కడా జరగని మద్యం కుంభకోణంను సృష్టించి, దీనిలో వైఎస్ జగన్ను ఇరికించి, అరెస్ట్ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు...ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి, ఇదే తరహాలో పాలన సాగించాలని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు చేస్తున్న తప్పులను కృష్ణుడి మాదిరిగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ను ప్రయోగిస్తూ, గత వైయస్ఆర్సీపీపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలను చూసి రేపు మన భవిష్యత్తు ఏమిటీ అనే ఆత్మ మథనం అధికారుల్లో ప్రారంభమైంది’’ అని భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. -
బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది. ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్ ఒక పక్కనుంటే.. ఇంకోపక్క ఒకటి అర కూడా అమలు చేయని కూటమి ఇంకోవైపున ఉంది. రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. దాన్ని చల్చార్చలేక కూటమి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోంది. రెడ్బుక్ పేరుతో సృష్టిస్తున్న ఆరాచకాలు.. జగన్పై లేనిపోని అభాండాలు వేయడం వంటివి ఎన్ని చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు.ఈ విషయం కూటమి నేతలకూ బాగానే అర్థమైంది. ఎక్కడికెళ్లినా జగన్కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తన స్వరాన్ని కొంత మార్చుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్సిక్స్ హామీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా అమలు చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి!. అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరిట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే.. పార్టీ కేడర్ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టమవుతుంది.టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్లో ఉన్న నీరు-చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు రూ.650 కోట్ల చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ స్కీమ్ల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపి వేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు రూ.1000కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రూ.650 కోట్ల నిధులు పంచబోతున్నారు. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం!. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీము అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి వేయాలని నిర్ణయించారంటూ, సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. టీడీపీ ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది.ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జగన్ రెండు, మూడు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎప్పుడు వెళ్లినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయనను ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ జై కొడుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లినప్పుడు, సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కాం అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్బ్యూరో నిశ్చయించిందట.జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంటగ్యాస్ వినియోగుదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా?. మళ్లీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నా, ఒక సిలిండర్ మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే రెండు లేదా, మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా?. వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. అలాంటిది అందరికి సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావుడి చేసేవారు? ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా? అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే బడ్జెట్ లో ఈ స్కీమ్కు వంద కోట్లే కేటాయించారని, అది ఎలా సరిపోతుందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్లో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తల్లికి వందనం గురించి ఇప్పటికి పలు వాయిదాలు వేశారు. మళ్లీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు. మహిళలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి చెప్పడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు. ఆ మాట గురించి ఏంటి?. జగన్ ఆయా స్కీమ్లను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేసేశామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు.ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ఉపయోగం?. పాలిట్బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి.. దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు కానీ.. ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చేశాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి!. ఇలాంటి అబద్ధాలే.. చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకూ పెంచుతున్నాయి!.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏ ఆధారాలతో వారిని అరెస్ట్ చేశారు?: రాచమల్లు
సాక్షి, కడప: కూటమి ప్రభుత్వం చేసే అరెస్ట్లు కుట్రలో భాగమేనని వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మద్యం పాలసీతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు సంబంధమే లేదన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేశారన్నారు.ఏ సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్ట్ చేశారో ప్రభుత్వం చెప్పగలదా? అంటూ రాచమల్లు శివప్రసాద్రెడ్డి నిలదీశారు. ‘‘సత్యప్రసాద్ అనే చిన్న ఉద్యోగిని బెదిరించారు. అతని బెదిరించి వారికి కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్లు ధైర్యంగా పనిచేయగలుగుతున్నారా?. ఐఏఎస్, ఐపీఎస్లు జైళ్లకు పోవాల్సిందేనా?’’ అంటూ రాచమల్లు దుయ్యబట్టారు.‘‘కొన్ని బ్రాండ్లే అమ్మారు.. అన్ని బ్రాండ్లు అమ్మలేదని ఆరోపణ.. కూటమి ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం చర్యలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఎవరిని జైలుకు పంపాలని ఉద్దేశంతో అక్రమ అరెస్ట్లు చేస్తున్నారు?. రూ.3,200 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో ఆధారాలతో చెప్పగలరా?. చంద్రబాబు మద్యం పాలసీ అత్త నీతులు చెప్పినట్లుంది. ఎన్నికలకు ముందు మద్యం ధరలు తగ్గిస్తామన్నారు.. తగ్గించారా?’’ అంటూ రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రశ్నించారు. -
ఈ అరెస్టులు అప్రజాస్వామికం: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని.. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నామని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై కూడా రాజకీయ విరోధం చూపిస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు.చంద్రబాబు తీసుకొచ్చిన తప్పుడు సంప్రదాయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయి. లిక్కర్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. కాని.. బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించారు. మరి ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఖజానా వల్ల నష్టం వచ్చిందన్నారు. మరి ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా ఆదాయాలు ఎందుకు పెరగడంలేదు?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కక్ష రాజకీయాలు తార స్థాయికి.. గడికోట శ్రీకాంత్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కక్ష రాజకీయాలు తార స్థాయికి చేరాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ‘‘ఐఏఎస్లను, ఐపీఎస్లను ఇప్పటికే టార్గెట్చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వాధికారులపైనా చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కు మంచివి కావు. చంద్రబాబు కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తాయి...పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంవల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వాగ్దానాల అమలు లేదు, ఏ వర్గంకూడా సంతోషంగా లేరు. రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రతలేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు. మాజీ ఐఏఎస్ ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు రాజకీయాలు మాని, రాష్ట్రంపై చంద్రబాబు దృష్టిపెట్టాలి. అణచివేసినంత మాత్రాన ప్రభుత్వంపై వ్యతిరేకత సద్దుమణగదు’’ అని శ్రీకాంత్రెడ్డి చెప్పారు.అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు.. మేరుగ నాగార్జునధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ క్రూరమైన రాజకీయ కక్ష సాధింపు అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు చర్య అని.. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోంది. ఈ అరెస్ట్లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని మేరుగ నాగార్జున హెచ్చరించారు.చంద్రబాబువి కక్ష రాజకీయాలు: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుమాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. ఈ అరెస్టులు అప్రజాస్వామికం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. విపక్ష పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారులతో పాటు మాజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహనరెడ్డిల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాను.వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ధనుంజయ రెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం.పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. తిరుపతి ఎంపీ గురుమూర్తిచంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నాను. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. -
‘కుట్రతోనే లిక్కర్ స్కామ్ అంటూ అక్రమ కేసు’
కాకినాడ: తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ,వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పని చేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే, నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండ గడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.బొత్స ఇంకా ఏం మాట్లాడారంటే..కూటమి ప్రభుత్వం దారుణ వ్యవహారంకూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్ ముగిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. కూటమి పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు.ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి కింది ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. కానీ, ఏడాది గడుస్తున్నా వాటిలో ఏదీ అమలు చేయడం లేదు.మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగింత. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. ‘సీజ్ ది షిప్’ అని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు.తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారు?ఏడాది పాలనలోనే ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు. ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు? మా హయాంలో అప్పులు చేసినా, వివిధ పథకాల కింద రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మరి కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి. సంపద సృష్టిస్తాను. అది తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు, మరి ఇన్ని అప్పులు, ఇంత తక్కువ సమయంలో ఎందుకు చేశారు? అప్పు చేయడం. ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొంత అప్పు చేసినా, ఆ ఖర్చులకు ఒక అర్థం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, తీర ప్రాంతాల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, బోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా ఉత్పాదకతకు దోహదం చేసే వాటికి ఖర్చు చేశాం. మాట ఇస్తే, దాన్ని తప్పకుండా నెరవేర్చాలనేది జగన్గారి విధానం. అందుకే ఎన్నికల ముందు, టీడీపీ కూటమి మాదిరిగా, అడ్డగోలు హామీలు ఇవ్వలేదు.పార్టీ కార్యాచరణ. నిర్ణయాలువైఎస్సార్సీపీ అయిదు జిల్లాల ముఖ్య నేతలతో ఈరోజు (శుక్రవారం) సమావేశం నిర్వహించాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రతి జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నాం. అలాగే గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో పాటు, తీర ప్రాంతాల్లోని ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పొగాకు రైతులు ఇదే సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు.దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పొగాకు రైతులను కలిసి నేరుగా వారితో మాట్లాడనున్నారు. తదుపరి పొగాకు కొనుగోళ్ళపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ పరంగా కార్యాచరణను ఖరారు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు మద్దతు ధర లభించని సందర్భంగా మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ మొద్దునిద్ర నుంచి ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు రైతుల పక్షాన పోరాడతామని బొత్య సత్యనారాయణ హెచ్చరించారు. -
మద్యం కేసు రాజకీయ ప్రేరేపితం: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు రాజకీయ ప్రేరేపితమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నట్టు సుప్రీంకోర్టుకు సైతం అర్థమైందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.‘‘చంద్రబాబు రూ.370 కోట్లు లూఠీ చేసినట్టు ఆధారాలతో సహా దొరికారు. ఏలేరు స్కాం నుంచి అనేక కేసులు విచారణ కూడా జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. దానిమీద ఒక్కరోజైనా వైఎస్ జగన్ని జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందర పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్షసాధింపు పనిలో పడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబే స్వయంగా అక్రమాలకు పాల్పడ్డారు. నిధుల విడుదల అక్రమమని తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేశారు. ఆధారాలతో సహా స్కిల్ కేసులో దొరికారు’’ అని పేర్ని నాని గుర్తు చేశారు.‘‘బ్రీఫ్డ్ మీ కేసులో టేపులతో సహా దొరికారు.. కానీ లిక్కర్ కేసులో జగన్కు ఏం సంబంధం?. ఆయన ఎక్కడైనా సంతకాలు పెట్టారా?. ఈ కేసులో నిజాయితీగా వ్యవహరించిన వినీత్ బ్రిజిలాల్ను తప్పించారు. తమకు వత్తాసు పలికే ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్ను వేసి లిక్కర్ కేసు నడుపుతున్నారు. కేసు నిలుస్తుందా? లేదా? అనేది పక్కన పెట్టి జగన్ అరెస్టే లక్ష్యంగా కేసు నడుపుతున్నారు. ఇందుకోసం ఎన్ని పాపాలు, తప్పులు చేయాలో అవన్నీ సిట్తో చేయిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగన్ వెనకడుగు వేయరు..చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్చెన్నాయుడు.. వీరంతా లిక్కర్ కేసు మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు, ఆరోపణలు చేశారు. అనేక కేసుల్లో దొరికిన దొంగ చంద్రబాబు. లక్షా 50 వేల కోట్లు అప్పు చేసి, ఆ డబ్బును ఏం చేశారో చెప్పటం లేదు. రాష్ట్ర ఆదాయాలు భారీగా పడిపోయాయి. సంపద సృష్టి ఇంకెప్పుడు చేస్తారు?. ప్రత్యేక విమానాల్లో విహారాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల కోసం మూడు హెలికాఫ్టర్లు కొనబోతున్నారు. ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు’’ అని పేర్ని నాని నిలదీశారు.మీరు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లిక్కర్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి వాట్సప్లో వచ్చిన ప్రశ్నలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వంశీ కేసులో కోట్ల రూపాయలను లాయర్లకు ఇస్తున్నారు. ప్రజల డబ్బును టీడీపీ నేతల అవసరాలు, కక్షసాధింపు కోసం ఖర్చు చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర డమ్మీ మంత్రి. ఆయన ఇంటి పక్కనే బెల్టుషాపు పెట్టినా చూస్తూ కూర్చున్న చేతగాని మంత్రి’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
‘చంద్రబాబు నిర్వాకం.. పదివేల మంది టీచర్లకు డిమోషన్’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. సీఎం చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయని అన్నారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తోంది. టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతోంది. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయి. చంద్రబాబు విధానం వలన 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి.ఒకవైపు సర్ప్లస్ చూపిస్తూ మరోవైపు డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు?. గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుంది?. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దు’ అంటే వ్యాఖ్యలు చేశారు. -
వంశీపై కూటమి కుట్రలు.. మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో మైనింగ్ అక్రమాలపై ఏడీ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.ఇప్పటికే వంశీకి ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు అయినప్పటికీ కూటమి సర్కార్ మాత్రం తప్పుడు కేసులతో వంశీకి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇంతలో నిన్న నూజివీడు పోలీసులు.. వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈరోజు మరో కేసు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్పై 58 పేజీలతో గనుల శాఖ ఏడీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్లో వంశీపై కేసు నమోదైంది. ఇలా.. వంశీపై ఏదో ఒక కేసు పెడుతూ వంశీకి బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. సర్కార్ తీరు కారణంగా వంశీ.. 90 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
బాబూ.. మీడియాతో పెట్టుకోకు!
ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్ కేసులు పెట్టలేదు.మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్ హయాంలో యూనిట్కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.అలాగే.. విశాఖలో టీసీఎస్కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008 నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెడ్బుక్ మరువను: మంత్రి నారా లోకేశ్
గుంతకల్లు/గుత్తి : ‘రెడ్బుక్ను ఎట్టి పరిస్థితిల్లోనూ మర్చిపోను.. టీడీపీ కేడర్ను ఇబ్బంది పెట్టిన అందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేపిస్తా’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారాలోకేశ్ పేర్కొన్నారు.గురువారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతూ ఏ సమావేశానికి వెళ్లినా పార్టీ కేడర్ రెడ్బుక్ గురించి అడుగుతున్నారని, ప్రతి ఒక్కరి చిట్టా విప్పి, చేయాల్సిన పని చేస్తానన్నారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు. వైఎస్ జగన్ నిర్వహకం వల్లే కరెంటు బిల్లుల్లో ట్రూఅప్ చార్జీలు వేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం స్కూల్ మూసివేస్తుందని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందన్నారు. అనంతపురానికి రూ.22 వేల కోట్ల విలువైన భారీ సోలార్ విండ్ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. -
ఆధి‘పచ్చ’ పోరు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. తమ మాటే వినాలని అటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. పోస్టింగ్లు, కాంట్రాక్టులు, ఇతర పనుల్లో తమ మాటే నెగ్గాలని ఎవరికి వారు పట్టుబడుతుండడంతో వారి మధ్య కోల్డ్వార్ సాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఈ విభేదాలు మరింత ముదిరిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ఎంపీల పెత్తనం ఎక్కువ కావడంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లోకేశ్ అండతో ‘చిన్ని’కిచినికి గాలివాన..!విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తాను లోకేశ్ మనిషినంటూ నియోజకవర్గాల్లో అన్నింటికీ తనకు వాటా ఉండాలని పట్టుబట్టి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇసుక ర్యాంపులు, మద్యం షాపులు, కాంట్రాక్టుల కోసం ఎక్కడికక్కడ తన మనుషులను పెట్టి వారితో వ్యవహారాలు నడిపిస్తున్నారు. విజయవాడ నగరంతోపాటు నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో చిన్నచిన్న విషయాల్లోనూ వేలు పెడుతుండడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనను వ్యతిరేకిస్తే లోకేశ్తో ఇబ్బంది వస్తుందనే ఆందోళనతో ఎవరూ బయటపడడం లేదని, కేశినేని చిన్ని తీరు అన్యాయంగా ఉందని వాపోతున్నారు.మా‘లావు’ చిక్కులునర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని నియోజకవర్గాల్లోనూ జోక్యం చేసుకుంటూ తన మాటే నెగ్గాలని పట్టుబడుతుండడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నిచోట్లా ప్రత్యేకంగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారితో పనులు చేయించేందుకు యత్నిస్తుండడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలోనే గురజాల, నర్సరావుపేట సీట్లను తాను చెప్పిన వారికి ఇప్పించేందుకు యత్నించినా గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, నర్సరావుపేటలో అరవింద్బాబు సీట్లు తెచ్చుకుని గెలిచారు. ఆ తర్వాత కూడా వారితో లావు విభేదాలు కొనసాగిసూ్తనే ఉన్నారు.నర్సరావుపేటలో జనసేన ఇన్చార్జిని ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన మర్రి రాజశేఖర్ను చేరదీయడంతో ఆయన వర్గం రగులుతోంది. మాచర్లలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని పక్కనపెట్టి తన మనుషులతోనే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తనకు మంత్రి పదవి రాకుండా లావు అడ్డుకున్నారనే కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు లావు శ్రీకృష్ణదేవరాయలుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.సిఫార్సుల ‘పెమ్మసాని’గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరులోని తెనాలి, తాడికొండ నియోజవర్గాల్లో బదిలీలు, పనులకు ఆయన ప్రత్యేకంగా సిఫారసు లేఖలు ఇస్తుండడంతో ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెనాలిలో ఒక విద్యుత్ ఏఈ పోస్టు కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వేర్వేరు వ్యక్తులను సిఫారసు చేస్తూ లేఖలు ఇవ్వడంతో ఎవరి చెప్పినట్లు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు.తగ్గ‘వేమిరెడ్డి’!నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నెల్లూరు జిల్లా అంతా తనదేనంటూ అన్నింట్లో జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఆయనకు సీఎం తనయుడు లోకేశ్ అండ ఉండడంతో మైనింగ్ వ్యవహారాల్లో ఆయన చెప్పినట్లే జరుగుతోంది. మైనింగ్ డీడీగా తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని తాను చెప్పినట్లు వినేలా చేసుకున్నారు. దీంతో ఆయన తమ మాట కూడా వినకుండా ఎంపీ ఏది చెబితే అది చేస్తున్నారని ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. సర్వేపల్లి, వెంకటగిరి, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీకి ఏమాత్రం పొసగడంలేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులకు సంబంధించిన అక్రమ మైనింగ్పై ఎంపీ వేమిరెడ్డి విజిలెన్స్ దాడులు చేయించినట్లు సమాచారం.విశాఖలో ‘భరత్’నాట్యమే!విశాఖపట్నం ఎంపీ భరత్ సీఎం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అన్ని విషయాలూ తనకు తెలియాలని, తనకు చెప్పి చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యవహారాలు, గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)కి చెందిన పనులకు సంబంధించి ఆయన పెత్తనం చేస్తుండడంతో ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారు. భరత్ వ్యవహార శైలిపై భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడుతున్నట్లు సమాచారం. అన్ని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటుండడంతో మిగిలిన ఎమ్మెల్యేలు పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా రగిలిపోతున్నారు. -
కొనసాగుతున్న కక్ష.. వల్లభనేని వంశీపై మరో పీటీ వారెంట్ దాఖలు
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. వల్లభనేని వంశీపై మరో పీటి వారెంట్ దాఖలైంది. నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ను పోలీసులు దాఖలు చేశారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారంటూ పీటీ వారెంట్ దాఖలు చేశారు. వంశీతో పాటు మరో 10 మందిపై కేసు నమోదైందికాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే అభియోగంపై అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ బెయిల్ పిటీషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటీషన్పై కౌంటర్ దాఖలు చేసిన అనంతరం ప్రాసిక్యూషన్ తరపున జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించగా, వంశీ తరపున సత్య దేవిశ్రీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం 12వ అదనపు జిల్లా న్యాయస్థానం జడ్జి తీర్పును శుక్రవారం వెల్లడించనున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్ ఎ71 నిందితునిగా ఉన్నారు. -
‘వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే.. అందుకే చంద్రబాబు ఇలా’
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ, వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజల కొనుగోలుశక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి, ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చేస్తానంటూ నమ్మించారు.కానీ ఆయన పాలనను చూస్తే దయనీయమంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్పై ఏ విధంగా బురదచల్లాలి, ఏ విధంగా ఆయన వ్యక్తిత్వహననం చేయాలి, వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు.వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీపై తప్పుడు కేసులులేని మద్యం కేసును రంగంలోకి తీసుకువచ్చి, దానిలో వైఎస్ జగన్కి సన్నిహితులైన వారందరినీ బాధ్యులుగా చూపి, ఒక పథకం ప్రకారం కక్ష సాధింపులకు చంద్రబాబు తెగబడ్డారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ సంస్థ వికాట్లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వికాట్ అనే సంస్థ 165 సంవత్సరాల కిందట ప్రారంభించిన సిమెంట్ కంపెనీ. యూరప్లోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన ఈ సంస్థ 1967లో ప్రారంభమైంది. ఈ సంస్థ 2024లో మొత్తం 44,316 కోట్ల రూపాయలు సిమెంట్ అమ్మకాల ద్వారా ఆర్జించిందంటే ఎంత బలమైన సంస్థో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ భారతీ సిమెంట్స్ను వరల్డ్ ఫస్ట్క్లాస్ టెక్నాలజీతో ప్రారంభించారు. దానిని 2010లో ఈ వికాట్ కంపెనీ టేకోవర్ చేసింది. 51 శాతం వాటాలు దీనికి ఉన్నాయి.ఈ వికాట్ కంపెనీనికి బాలాజీ గోవిందప్ప ఫుల్టైం ఫైనాన్స్ సెక్రటరీ. కేవలం వైఎస్ జగన్ ప్రారంభించిన కంపెనీలో ఈయన పనిచేస్తున్నారనే కారణంతోనే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి, దానిలో ఆయనను ఇరికించి, ఆయనను జైలుకు పంపారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఈ అరెస్ట్ ఒక ఉదాహరణ. అలాగే సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే పెద్ద వ్యాపార దిగ్గజ్జం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించి, పనులు ప్రారంభించారు.చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒక సెకెండ్ గ్రేడ్ సినిమా ఆర్టీస్ట్ను అడ్డం పెట్టుకుని జిందాల్ను వేధింపులకు గురి చేశారు. ఇవి తట్టుకోలేక జిందాల్ కడప నుంచి వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టారు. ఒక డీజీపీ ర్యాంక్లో ఉన్న పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా వైఎస్ జగన్పై కోపంతో, మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో పారిశ్రామికవేత్తలను చంద్రబాబు భయపెట్టాలని చూస్తున్నారు.కూటమి నేతల అరాచకాలతో పారిశ్రామికవేత్తలు బెంబేలుమరోవైపు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలపై మామూళ్ల కోసం దాడులు చేస్తున్నారు. తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫిర్యాదులు చేశారు. తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని కంపెనీకి ముడిసరుకుని ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థలను ఇబ్బంది పెట్టారు. దీనితో సిమెంట్ ప్లాంట్నే మూసేసే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మన దేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా అన్నీ ఉత్పత్తి చేసుకోవాలని చెబుతుంటే, అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని ఏకంగా ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్నే మూయించే ప్రయత్నం చేశారు. ఇలా చేస్తుంటే పరిశ్రమలు వస్తాయా?గండికోట ప్రాంతంలో ఆదానీ హైడ్రోపవర్ పైనా బీజేపీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు తమకే మొత్తం కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఆ కంపెనీ కార్యాలయంపైనే దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీలో ఏ పరిశ్రమ అయినా సరే కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే, లేనిపక్షంలో ఆ సంస్థలు పనిచేయవు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడులోని గురజాడలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాను ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశానని, ఆ డబ్బును భవ్య, చెట్టినాడు సిమెంట్ ప్లాంట్లు చెల్లించాలంటూ వారిని వేధించడంతో ఈ రెండు సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయి.శ్రీకాకుళంలోని యూబీ బీర్ తయారీ ఫ్యాక్టరీపై నడికుదిటి ఈశ్వర్రావు అనే బీజేపీ ఎమ్మెల్యే బీర్ రవాణా చేసే ఒక్కో లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ లెక్కన నెలకు రూ.1.50 కోట్లు వారి నుంచి డిమాండ్ చేశాడు. పదివేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న యూబీ సంస్థపై ఇలాంటి వేధింపులకు పాల్పడటంతో ఆ సంస్థ ఎలా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది? జాతీయ రహదారుల కాంట్రాక్ట్ల కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్లు పోటీపడి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. దాల్మియా సిమెంట్పై చంద్రబాబు కక్షసాధింపు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.793 కోట్ల రూపాయలు జప్తు చేసే కార్యక్రమం చేశారు. టీవీ9 ను లొంగతీసుకోవాలని మైహోం రామేశ్వరరావుకు చెందిన సిమెంట్ కంపెనీకి గనుల నుంచి ముడిసరుకుని రానివ్వకుండా వేధిస్తున్నారు.అసమర్థ పాలనతో ప్రగతి శూన్యంచంద్రబాబు అద్భుతమైన సంపద సృష్టిస్తాను, పరిశ్రమలను తీసుకువస్తాను అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాటు మంచి పాలనను అందించిన వైఎస్ జగన్ కాదని ఒక దుర్మార్గమైన పాలనను అనుభవిస్తున్నామని నేడు అన్ని వర్గాలు ఆవేదన చెందుతున్నారు. కాగ్ లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రం తిరోగమనంలో ఉందని తెలుస్తుంది. 2023-24లో వచ్చిన ఆదాయం కంటే 2024-25లో వచ్చిన ఆదాయంలో తగ్గుదల రూ.5520 కోట్లు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టించడం? ఆయన సంపద పోగొడుతున్నాడు.అమ్మకంపన్ను, స్టాంప్ డ్యూటీ చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.1,053 కోట్లు పడిపోయింది. రిజిస్ట్రేషన్లు లేవు, అమ్మకాలు లేవు, ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లింది. ఇదీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలన. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.705 కోట్లకు పడిపోయింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024-25లో రూ.842 కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన డబ్బు 2024-25లో రూ.14,563 కోట్లు తగ్గింది. మూలధన వ్యయం రూ.4,413 కోట్లకు తగ్గిపోయింది. విద్యా, వైద్యం, సంక్షేమం తదితరాలకు చేసిన వ్యయం రూ.4696 కోట్లు తగ్గింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన లెక్కలు ఇవి.హామీల అమలులో పూర్తి వైఫల్యంచంద్రబాబు ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని గొప్పగా తమను తాము ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు ఏదీ? ఈ హామీలను అమలు చేయడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు బడ్జెట్లో కేటాయించింది చూస్తే రూ.7,282 మాత్రమే. దీనిలో ఖర్చు పెట్టింది రూ.865 కోట్లు మాత్రమే. చివరికి పెన్షన్లలోనూ మూడు లక్షల వరకు కోత పెట్టారు. ఉచిత బస్పు ఊసే లేదు.చివరికి తల్లికి వందనం కింద ఇచ్చేదానిని కూడా వాయిదాల ప్రకారం ఇస్తానంటున్నారు. గతంలో ఇలాగే రైతురుణమాఫీని కూడా ఎగ్గొట్టారు. ఇప్పుడు తల్లికి వందనంను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక నిరుద్యోగభృతి అమలు ఏమయ్యిందో తెలియదు. పాలన ద్వారా ప్రజలను మెప్పించి, మళ్ళీ అధికారంలోకి రావాలనే కోరికే చంద్రబాబుకు లేదు. చంద్రబాబ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోయాయి.రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తీవ్రంగా భ్రష్టు పట్టించారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఇటీవలే చిలుకలూరిపేటలో సీఐ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. న్యాయస్థానాలు పోలీసుల తీరుపై చాలా ఘాటుగానే విమర్శిస్తున్నా స్పందించడం లేదు. ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాల ప్రకారం వ్యవహరించకపోతే భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏం చెబితే గుడ్డిగా దానిని అనుసరించుకుంటూ పోతే దానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొందరు అధికారులు చట్టాలను అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీసత్యసాయి జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ!
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. దొడ్డిదారిన మడకశిర మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం నెగ్గిన టీడీపీ.. బలం లేకపోయినా ఛైర్మన్పై అవిశ్వాసం పెట్టింది. గతంలో మొత్తం 20 వార్డులకు 15 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించగా, కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది.కాగా, రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెత్తనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. ఈ క్రమంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చేజిక్కించుకున్న స్థానాలను సొంతం చేసుకునేందుకు దిగజారి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకున్న టీడీపీ నేతలు మడకశిర మున్సిపాలిటీని కూడా అప్రజాస్వామికంగా కైవసం చేసుకున్నారు.మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 15 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో చైర్పర్సన్గా దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్గా రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరినీ ఎలాగైనా పదవుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు ప్లాన్ వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందికి పచ్చ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఐదుగురితో పాటు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారు. -
‘ఏపీలో జీహెచ్ఎంసీ యాక్ట్?.. కూటమిలో కుర్చీ కోసం కుమ్ములాట’
సాక్షి, వైఎస్సార్: కూటమి పాలనలో అభివృద్ధి లేదు.. కానీ కక్ష సాధింపులో మాత్రం ముందుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పుకొచ్చారు. కుర్చీల కోసం కుమ్ములాట నడుస్తోందన్నారు.వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో అభివృద్ధి లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కక్ష సాధింపులో భాగంగా రాక్షసానందం పొందుతున్నారు. వాళ్ళు పెడుతున్న కేసులు ఏవీ కోర్టుల్లో నిలబడటం లేదు. కడప మేయర్ సురేష్ బాబు విషయంలోనూ అదే తీరులో వెళ్తున్నారు. అసలు యాక్ట్ లేదు.. మనం జీహెచ్ఎంసీ యాక్టు అమలు చేసుకుంటున్నాం. మన రాష్ట్రానికి అసలు యాక్ట్ లేనే లేదు. జీహెచ్ఎంసీ యాక్టు చూపించి మా మేయర్పై చర్యలు తీసుకోవడం విడ్డూరం. మేయర్ కుమారుడి సంస్థకు కమిషనర్ రిజిస్టర్ చేస్తారు.. అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదు?ఆరోపణల్లో ఏదైనా అవినీతి చూపించలేదు. కుర్చీల కోసం కుమ్ములాట కోసం ఇదంతా జరుగుతోంది. వాళ్ళ పత్రికలే కుర్చీల కోసమే ఇదంతా జరుగుతుందని రాసింది. ఎమ్మెల్యేలకు చాలా కంపెనీలు ఉన్నాయి.. మరి వాళ్ళు కాంట్రాక్టులు చేయవచ్చా?. మేయర్ తన వివరణలో తన దృష్టికి రాలేదని వివరణ కూడా ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై మాకు గౌరవం ఉంది.. న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి నేరుగా ఫిర్యాదు చేసారట.. దీనిలో ఇక రాజకీయం లేక ఏముంది?. నగరానికి ఆమె ఒక్క పైసా నిధులు తీసుకురాక పోగా కక్ష సాధింపులకు దిగడం సరికాదు.వేదికపై మేయర్ ఒక్కరే కూర్చోవాలి.. అది చట్టం. నీకు కుర్చీ వేయలేదని కక్ష సాధింపు అంటే ఎలా?. దీనికి మేయర్ ఇంటిపై చెత్త వేయిస్తారా?. తప్పుడు ఫిర్యాదులు చేస్తారా?. ఈ ప్రభుత్వం రాగానే అవిశ్వాసం పెట్టీ దించాలని ప్రయత్నం చేశారు. అది వీలు కాకపోవడంతో ఈ రకంగా కక్ష సాధింపునకు దిగుతున్నారు. చిన్న విషయాన్ని చూపి అనర్హత అనడం దారుణం’ అంటూ మండిపడ్డారు. -
‘ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి? ’
తాడేపల్లి : రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతే చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కారుమూరి.. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.‘జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేశారు. పంట నష్టం వచ్చినా అందుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. చంద్రబాబు వచ్చాక కౌలుదారీ కార్డులు తొలగించారు. ఖరీఫ్ సీజన్ కి మరో 15 రోజులే సమయం ఉంది. ఈలోపు కౌలుదారులకు కూడా న్యాయం చేయాలి. 80% మంది ఉన్న కౌలు రైతుల మేలు గురించి పట్టించుకోకపోవడం దారుణం. జగన హయాంలో తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేశారు. కౌలు రైతుకు కూడా కార్డులు ఇస్తే ఎక్కడ ప్రభుత్వ మేలు చేయాల్సి వస్తుందోనని చంద్రబాబు ఇవ్వటం లేదు. 32 లక్షల మంది కౌలు రైతులు చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి?, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే ఇంకా చంద్రబాబు ఉన్నారు. అమరావతి మీద చూపే ప్రేమ రైతుల మీద కూడా చూపించండి. పొగాకుకు ధరల్లేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రూ.18 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.10వేలు కూడా లేదురైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వారి తరపున పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు. -
‘రాష్ట్రంలో విద్యకు చంద్ర గ్రహణం పట్టించారు’
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు పాలనతో రాష్ట్రానికి రాహు కాలం పట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్యను విధ్వంసం చేసి చంద్రగ్రహణం పట్టించారని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. ప్రీ హైస్కూల్స్, శాటిలైట్ స్కూల్స్ వంటి రీఫామ్స్ తెచ్చారు. వాటి వలన 25 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ వచ్చాయి. జీవో 117 తో జగన్ తెచ్చిన మార్పులు ఎప్పటికీ గుర్తుండి పోతాయి.చంద్రబాబు తెచ్చిన 9 రకాల వ్యవస్థల వలన విద్యారంగం నాశనం అయింది. దీని వలన టీచర్ల మధ్య కూడా వైషమ్యాలు తెచ్చారు. చివరికి 26 వేల స్కూళ్లు దెబ్బతినబోతున్నాయి. ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ స్కూళ్ల మీద విరక్తి కలిగేలా చేస్తున్నారు. జగన్ మీద ఉన్న కోపాన్ని స్కూళ్ల మీద చూపిస్తూ వాటిని నాశనం చేస్తున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు’ అని స్పష్టం చేశారు. -
ఏపీ పోలీసుల ఆగడాలకు హద్దు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ఏమైంది?. ప్రభుత్వమేదైనా.. రాజకీయ ప్రభావం ఎంతో కొంత ఉండవచ్చు కానీ.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో మాత్రం పోలీసింగే తక్కువైపోతోంది!. వేసే ప్రతి అడుగు రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు మహిళలన్న విచక్షణ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు లాకప్ మరణాలూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 1980లలో తరచూ కనిపించిన లాకప్డెత్ వార్తలు మళ్లీ పత్రికలకు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రమీజాబి, షకీలా అనే ఇద్దరు మహిళల లాకప్ డెత్ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేశాయి. విపక్షాల ఆందోళనను అదుపు చేయడమే ప్రభుత్వానికి కష్టమైపోయింది. ఒక మహిళను గన్నవరం వద్ద పోలీసులు హింసిస్తే ప్రజలే తిరుగుబాటు చేసినంత పనిచేశారు. లాకప్డెత్లకు సంబంధిత పోలీసు అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకునేవారు. ఒకసారి విజయవాడలో మురళీధరన్ అనే కేరళ వ్యక్తి లాకప్లో మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయ వ్యవస్థ జోక్యంతో లాకప్ డెత్ల విషయంలో పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.తాజా పరిణామాల విషయానికి వస్తే.. సాక్షి దినపత్రికలో ‘ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్’ శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. రాజకీయ బాస్లను మెప్పించేందుకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారా? అనిపిస్తుంది. దీన్ని చదివితే టీడీపీ జిల్లా నేత, అధిష్టానానికి సన్నిహితుడైన వీరయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని మరో వర్గం వారే హత్య చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీరయ్య చౌదరి అంత్యక్రియలకు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కేసు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆ తరువాత పోలీసులు ఈ హత్య కేసులో అనుమానితులన్న పేరుతో కొందరిని నిర్బంధించి హింసిస్తున్నట్లు.. నేరం తామే చేసినట్టుగా ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిందితులైతే అరెస్టు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ.. అనధికారికంగా నిర్బంధించడంతోనే వస్తోంది సమస్య.పోలీసుల హింస తట్టుకోలేక ఒక అనుమానితుడు ప్రాణాలు కోల్పోవడంతో సమస్య జటిలమైంది. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కితే మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారట. పోలీసు ఉన్నతాధికారి ఒకరి పాత్ర కూడా ఇందులో ఉందట. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పి అంత్యక్రియలు కూడా జరిపించేశారట. ప్రజలను కాపాడవలసిన పోలీసులే ఇలా లాకప్ డెత్లకు కారణం అవుతుంటే ఏపీలో పాలన తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం అవుతుంది.ఎల్లో మీడియా గతంలో జగన్ ప్రభుత్వ టైమ్లో ఏ ఘటన జరిగినా భూతద్దంలో చూపుతూ నానా యాగీ చేసేవి. రాజమండ్రి వద్ద ఒక పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి శిరోముండనం చేశారు. అది బయటకు వచ్చింది. వెంటనే జగన్ ప్రభుత్వం సంబంధిత పోలీసు అధికారులపై కేసు కూడా పెట్టి చర్య తీసుకుంది. అయినా అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కలిసి దారుణమైన రీతిలో ప్రచారం చేశాయి. సుధాకర్ అనే ఒక డాక్టర్ మద్యం తీసుకుని విశాఖ రోడ్డుపై రచ్చ చేస్తుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి స్టేషన్కు తీసుకువెళ్లాడు. దానిపై ఎంత గందరగోళం సృష్టించారో అందరికి తెలుసు. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా విరుచుకుపడేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పోలీసుల కారణంగానే మరణించినా ప్రభుత్వం పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించదు.మరోవైపు మాజీ మంత్రి విడదల రజని పట్ల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యవహరించిన తీరు శోచనీయం. ఆమెను కారు నుంచి బలవంతంగా దించి, కారణం, కేసు వివరాలు చెప్పకుండా ఆమె వద్ద పనిచేసే వ్యక్తిని అరెస్టు చేసిన వైనం తీవ్ర విమర్శలకు గురైంది. గుంటూరు జిల్లాలో ఒక మహిళా ఎంపీటీసీని రాత్రివేళ కనీసం డ్రెస్ మార్చుకోనివ్వకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కృష్ణవేణి అనే సోషల్ మీడియా కార్యకర్తను గతంలో అరెస్టు చేసి పలు స్టేషన్లకు తిప్పారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు, హత్యలు వంటి వాటిని అరికట్టడానికి పోలీసులు ఏం చర్యలు చేపడుతున్నది తెలియదు కాని, ఇలా వైఎస్సార్సీపీకి చెందిన మహిళలను మాత్రం పలు రకాలుగా పోలీసులతో వేధిస్తున్న తీరు అభ్యంతరకరం అని చెప్పాలి.ఇవే కాదు.. అటవీ శాఖాధికారి, సీనియర్ అధికారి సిసోడియా వద్ద ఓఎస్డీగా పనిచేసిన మూర్తి అనే అధికారిని సిసోసియా మనుషులే కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూర్తి ఇంటెలిజెన్స్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారట. ఈ కేసు సంగతి వదలి, అతనిని పోలీసులు ఇబ్బంది పెడుతుంటే హైకోర్టు జోక్యం చేసుకుని రక్షణ కల్పించిందట. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మార్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను ప్రత్యర్దులు కారు టిప్పర్తో ఢీకొట్టి వేట కొడవళ్లతో హత్య చేశారు. ఇది టీడీపీ నేతతో ఉన్న ఫ్యాక్షన్ గొడవతోనే. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ హత్య జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు వాపోతున్నారు.మరో ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని గత నవంబర్ 8న అరెస్టు చేసి పదో తేదీన జరిగినట్లు రికార్డుల్లో చూపించారన్న విషయమై హైకోర్టు కూడా సీరియస్ అయింది. రెడ్ బుక్ పాలనలో సీనియర్ ఐపీఎస్ అధికారులు కొందరికి కూడా అక్రమ కేసుల బెడద తప్పడం లేదు. గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండటమే వీరు చేసిన తప్పుగా ఉంది. ఈ పరిణామాలేవీ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది కాదు. ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే మ్యూజిక్ను ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్సార్సీపీ హెచ్చరికలు చేస్తున్నా, పోలీసు అధికారులు కొందరు రాజకీయ బాస్లకు అత్యంత విధేయులుగా ఉండడానికి, వారి మెప్పు పొందడానికి ఆగడాలకు దిగుతున్నారు. ఇది దురదృష్టకరం!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘రూ. 300 కూలి కోసం పనికి వెళితే వేధించారు’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపురించిందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం.. ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జగన్మోహన్ రావు.. ‘ చందర్లపాడు లో ఉపాధి హామీ కూలి చేసే మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగులు మందు తాగింది. రూ. 300 కూలి కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది అని పనికి వెళితే వేధించారు. ఆమె మాట్లాడిన వీడియో ఉన్నా... అనుమానాస్పద మృతి గా కేసు కట్టడం దారుణం. ఆమె భర్త చేత కడుపు నొప్పి అని ఫిర్యాదు చేయించడం బాధాకరం. కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా..?, ఆమె మరణ వాంగ్మూలంకి విలువ లేదా?, ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను ప్రశ్నించినందుకు ఆమె ను వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనుల్లో ఇలానే అక్రమాలు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ప్రమేయంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇంత ఘోరంగా వేధించి చంపేస్తే కేసును తారుమారు చేస్తున్నారు. గతంలో కూడా కాకినాడలో మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ని డబ్బులు ఇమ్మని వేధించారు. ఉపాధి పనుల్లో ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఎందుకని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఉపాధి కూలీలు వైఎస్సార్ సీపీకి చెందినవారైతే పనులు ఇవ్వకుండా వేధిస్తున్నారు.