అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై జరపాలనుకున్న సైనిక దాడిని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల అధినేతలు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రతిపాదనల విషయంలో తిరస్కరణల పరంపర కొనసాగుతుండడంతో మరోసారి మధ్యప్రాచ్యంలో బాంబుల మోత మోగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ట్రంప్ తాజా నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి కాస్త పక్కకు తొలిగాయి.
"ఇరాన్తో ప్రస్తుతం కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్పై మేము తలపెట్టిన సైనిక దాడిని వాయిదా వేయమని ఖతార్ అమీర్ షేక్ తమీమ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్లు నన్ను కోరారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు లేకుండా చేస్తామమని" ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో రాసుకొచ్చారు.
కాగా ఇరాన్ విషయంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ భిన్నమైన వైఖరులను కలిగి ఉన్నాయి. ఇరాన్తో శాంతి చర్చలు సఫలం కాకపోతే భారీ దాడి చేస్తామని ట్రంప్ ఇటీవలే మరోసారి హెచ్చరించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే మొత్తం తమ ప్రాంతమే అతలాకుతలం అవుతుందని భావించిన గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి.


