ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త జనాభా విధానంపై హైదరాబాద్కుచెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ (పిల్లల వైద్యురాలు) డాక్టర్ శివరంజని సంతోష్ (Dr. Shivaranjani Santosh) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఏకకాల నగదు బహుమతి, పిల్లల సుదీర్ఘ భవిష్యత్తుకు భద్రతను ఇవ్వలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
నకిలీ ఓఆర్ఎస్ ఉత్పత్తులపై గళమెత్తిన డా. శివరంజని సంతోష్ ఏపీ సీఎం చంద్రబాబు నలుగురు పిల్లల విధానంపై ఘాటుగా స్పందించారు. రూ. 30, 40 వేల కోసం పిల్లల్ని కనవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ డబ్బు కేవలం కొన్ని రోజుల్లోనే ఖర్చయిపోతుందని చెప్పారు. పిల్లల పెంపకానికి ఏళ్ల తరబడి ఆర్థిక, శారీరక, మానసిక మద్దతు అవసరమని గుర్తుచేశారు.
ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు
ఒక వైద్యురాలిగా, తల్లిగా మాట్లాడుతున్నాను తప్ప, తన ఆందోళనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేసిన ఆమె పిల్లల సంక్షేమమే ముఖ్యమని తేల్చి చెప్పారు. కుటుంబంలో పిల్లల సంఖ్య పెరిగితే వారికి సరైన పోషకాహారం, వైద్యం, నాణ్యమైన విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కావచ్చని ఆందోళన వెలిబుచ్చారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ప్రతి బిడ్డకు సమానంగా సమయం, ప్రేమ, శ్రద్ధ ఇవ్వడం సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు. అలాగే నివాస స్థలం (ఇల్లు) కూడా సరిపోకపోవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు ఇటువంటి విధానాలు మిగిలిన రాష్ట్రాలకు కూడా పాకకూడదని ఆమె హితవు పలకడం గమనార్హం.
కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మారుతున్న డెమోగ్రాఫిక్ (జనాభా సంతులనం) పరిస్థితుల దృష్ట్యా నలుగురు పిల్లల్ని కనాలని సూచించారు. ఇందుకు తమ ప్రభుత్వం మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ. 30వేలు, , నాలుగో సంతానానికి రూ.40 వేలు అందిస్తుందని ప్రకటించారు. అయితే ఇలా ఎక్కువ మంది పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహించడం విమర్శలకు తావిచ్చింది.
ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మూణ్నాళ్ల ముచ్చటే : డీఎంకే సీనియర్ నేత జోస్యం


