Iran War అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చిన వారికి 58 మిలియన్ డాలర్ల (సుమారు 50 మిలియన్ యూరోలు, రూ. 480 కోట్ల ) బహుమతి (బౌంటీ) ప్రకటించే దిశగా ఇరాన్ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని 'ఇరాన్ వైర్', 'ది టెలిగ్రాఫ్ యూకే' నివేదికల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇరాన్ పార్లమెంట్కు చెందిన 'నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిటీ' చైర్మన్ ఇబ్రహీం అజీజీ ఈ బిల్లును సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి "కౌంటర్-యాక్షన్ బై ది మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్" అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. .ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిగిన వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇతనితోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. ప్రస్తుత సుప్రీం లీడర్ తీవ్ర గాయాలు పాలుకావడానికి కూడా ఈ దాడులే కారణమని అంచనా. ఈ దాడులకు ప్రతీకారంగా ట్రంప్, నెతన్యాహులను హతమార్చడానికి రివార్డులను ప్రతిపాదించే ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. ఖమేనీ హత్యలో పాత్ర ఉన్నందుకు గాను ట్రంప్, నెతన్యాహు, మరియు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "ప్రతీకార చర్య" తీసుకోవాలని అజీజీ పేర్కొన్నట్లు ఇరాన్ వైర్ తెలిపింది. జాతీయ భద్రతా కమిషన్ లోని మరొక సభ్యుడు మహమూద్ నబవియాన్ కూడా, ట్రంప్, నెతన్యాహులను "నరకానికి పంపే" ఎవరికైనా బహుమతులు ఇచ్చే బిల్లుపై తమ పార్లమెంట్ త్వరలోనే ఓటు వేస్తుందని ప్రకటించారు.
మసాఫ్ (Masaf) మీడియా : 'కిల్ ట్రంప్' ప్రచారం ,సైబర్ గ్రూప్ ప్రకటనఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ 'మాసఫ్' కొన్ని రోజుల క్రితమే ఒక ప్రకటన చేస్తూ, ఇస్లామిక్ ప్రభుత్వం "కిల్ ట్రంప్" అనే ప్రచారం కోసం 50 మిలియన్ల డాలర్ల ఆర్థిక వనరులను సమకూర్చుకుందని పేర్కొంది.
హండాలా (Handala) హ్యాకింగ్ గ్రూప్: అంతకుముందు, ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ వార్ఫేర్ గ్రూప్ "హండాలా" కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా న్యాయ శాఖ తమ గ్రూప్ సభ్యుల సమాచారం కోసం 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించినందుకు ప్రతిస్పందనగా... "అణచివేత, అవినీతికి ప్రధాన సూత్రధారులు" అయిన ట్రంప్ మరియు నెతన్యాహులను అంతమొందించడానికి తాము ఈ వనరులను కేటాయించామని హండాలా క్లెయిమ్ చేసింది. ఈ ఇద్దరు దేశాధినేతలపై "ప్రత్యక్ష చర్య" తీసుకునే ఏ వ్యక్తికైనా లేదా సమూహానికైనా ఈ డబ్బు చెల్లిస్తామని ఆ హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ బౌంటీ (రివార్డు) చట్టం, గతంలో వారు చేసిన మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల కంటే చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు.
గతంలో ఇరాన్ కేవలం మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల ద్వారా మాత్రమే ఇలాంటి హెచ్చరికలు చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో చట్టబద్ధంగా బౌంటీ బిల్లును తీసుకురావాలని చూడటం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని తీవ్ర ముప్పులోకి నెడుతుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్
అమెరికా హెచ్చరిక: గతంలో ట్రంప్ మాట్లాడుతూ.. తనను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని "భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాం" (Wipe them off the face of the Earth) అని తీవ్రంగా హెచ్చరించారు.
శాంతి చర్చల్లో సందిగ్ధత: ఇరాన్ తాజాగా అమెరికాకు ఒక కొత్త శాంతి ప్రతిపాదనను పంపినప్పటికీ, అది పాత ప్రతిపాదనల కంటే పెద్దగా మెరుగ్గా ఏమీ లేదని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని మరియు ఇరాన్ సానుకూలంగా స్పందించాల్సిన ఒత్తిడి వారిపైనే ఉందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?


