నీటితో ఇంధన సంక్షోభానికి ఎండ్ కార్డ్? | Could Water Based Fuel Tech be Answer to Indias Energy Crisis | Sakshi
Sakshi News home page

నీటితో ఇంధన సంక్షోభానికి ఎండ్ కార్డ్?

May 19 2026 11:19 AM | Updated on May 19 2026 12:05 PM

Could Water Based Fuel Tech be Answer to Indias Energy Crisis

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు మండిపోతుండటం, రూపాయి విలువ క్షీణిస్తుండటంతో భారతదేశం తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రజలపై భారం పడకుండా రోజుకు దాదాపు రూ.1,000 కోట్లు నష్టపోతున్న తరుణంలో యూరప్‌లోని మొనాకోకు చెందిన ‘ఫోవ్ ఎకో సొల్యూషన్స్’ ఒక  అద్భుత పరిష్కారంతో ముందుకు వచ్చింది. కేవలం ‘నీటి’ ఆధారిత సాంకేతికతతో దేశంలో రూ.1.7 లక్షల కోట్ల ఇంధన సంక్షోభానికి తెరదించవచ్చని ఈ సంస్థ చెబుతోంది.

ఏంటీ ఈ ‘క్యావిటెక్’ మాయాజాలం?
ఈ సరికొత్త ఇంధన విప్లవం వెనుక ‘క్యావిటెక్’ అనే పేటెంటెడ్ ఎమల్షన్ టెక్నాలజీ ఉంది. కంట్రోల్డ్ క్యావిటేషన్ టెక్నాలజీ (సీసీటీ) ద్వారా  రసాయన రహితంగా ఇంధనంలో సూక్ష్మమైన నీటి బిందువులను ఈ సాంకేతికత ప్రవేశపెడుతుంది. ఈ ఇంధనం మండే సమయంలో ఇంజిన్ లోపల చిన్నపాటి ‘సూక్ష్మ పేలుళ్లు’ సంభవిస్తాయి. దీనివల్ల ఇంధనం పూర్తిగా, అత్యంత సమర్థవంతంగా మండి, మైలేజీని పెంచుతుంది. ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, ప్లాంట్లను మూసివేయకుండానే ఇంధన వినియోగాన్ని 10 శాతం వరకు తగ్గించవచ్చని సంస్థ చెబుతోంది.

భారతీయ పరిశ్రమల్లో విజయవంతమైన ప్రయోగాలు
డెన్మార్క్‌లోని ఆల్ఫా లావల్ సంస్థతో పాటు అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలలో జరిగిన పరీక్షల్లో ఈ టెక్నాలజీతో 6 నుంచి 10 శాతం వరకు ఇంధనం ఆదా అయినట్లు రుజువైంది. భారతదేశంలోనూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) హల్దియా రిఫైనరీ, బీపీసీఎల్ (బీపీసీఎల్‌) మథుర, పలు ఉక్కు కర్మాగారాలలో దీనిపై ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రయోగాలు నిర్వహించారు. హల్దియా రిఫైనరీలో 3.6 శాతం, ఒక ఉక్కు కర్మాగారంలో ఫర్నెస్ ఇంధన వినియోగం 5 శాతం మేర తగ్గినట్లు ఫలితాలు వెల్లడించాయి. అంతేకాకుండా, దేశంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో బాయిలర్లను ప్రారంభించే సమయంలో ఈ టెక్నాలజీ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

పర్యావరణానికి మేలు.. విదేశీ మారకద్రవ్యానికి రక్షణ
భారతదేశం తన ముడిచమురు అవసరాలలో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో,  లీటరు ఇంధనం ఆదా అయినా అది దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుతుందని సంస్థ సీఓఓ హేమంత్ సోంధీ పేర్కొన్నారు. ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఈ టెక్నాలజీ ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు 30 శాతం, సల్ఫర్ ఆక్సైడ్  ఉద్గారాలు 40 శాతం వరకు తగ్గుతాయి. పర్యావరణ కాలుష్యాన్ని అరికడుతూ, పరిశ్రమల నిర్వహణ వ్యయాన్ని తగ్గించే ఈ నీటి ఆధారిత సాంకేతికత ప్రస్తుత తరుణంలో భారతదేశానికి అత్యంత కీలకంగా మారనుంది.

ఇది కూడా చదవండి: తైవాన్ యుద్ధంలోకి ఫిలిప్పీన్స్

Advertisement
 
Advertisement
Advertisement