‘కేరళ మత్స్యకారులకు నోబెల్‌ ఇవ్వండి’  | Sakshi
Sakshi News home page

‘కేరళ మత్స్యకారులకు నోబెల్‌ ఇవ్వండి’ 

Published Thu, Feb 7 2019 8:26 AM

కేరళలో వరదల సందర్భంగా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి తోటి ప్రజలను కాపాడిన మత్స్యకారులను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ నోబెల్‌ శాంతి పురస్కారానికి సిఫార్సుచేశారు. ఈ మేరకు ఆయన నార్వే నోబెల్‌ ఎంపిక కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. 2019 నోబెల్‌ పురస్కారాల ఎంపికలో మత్స్యకారులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గత ఆగస్టులో కేరళలో వరదలు ప్రళయం సృష్టిస్తున్న సమయంలో సహాయక చర్యల్లో పాలుపంచుకుని మత్స్యకారులు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, తెగువను కొనియాడారు.

‘కేరళలో అంత పెద్ద విపత్తులో మత్స్యకారులు తమకు జీవనాధారమైన పడవల్ని సైతం పణంగా పెట్టి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తమ పరిసరాల్లో చిక్కుకున్న వారిని కాపాడటంతోపాటు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్న సహాయక బృందాల పడవలను బయటపడేశారు’ అని థరూర్‌ లేఖలో పేర్కొన్నారు. ఓ మత్స్యకారుడు నీటిలో వంగినపుడు వృద్ధులు అతని వీపుపై కాలుపెట్టి పడవ ఎక్కిన దృశ్యం చిరకాలం గుర్తుండిపోతుందని తెలిపారు.

Advertisement
Advertisement