అడ్డదారే ప్రమాదానికి కారణం

జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో మంగళవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం 57 మందిని బలిగొంది. కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ (ఏపీ 29 జెడ్‌ 2319 ఆర్డినరీ) బస్సు కొండగట్టు సమీపంలోని ఘాట్‌ వద్ద లోయలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 100 మందిలో 57 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ప్రమాద స్థలంలోనే 24 మంది మృతి చెందారు. మరో 26 మంది జగిత్యాల ఆస్పత్రిలో, ఏడుగురు కరీంనగర్‌ జిల్లా కేంద్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, 38 మంది మహిళలు ఉన్నారు. 43 మంది క్షతగాత్రులను కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ మృతి చెందగా, కండక్టర్‌ పరమేశ్వర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షతగాత్రుల్లో సగం మందికిపైగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రమాద ఘటనలో ఊపిరి ఆడకపోవడంతోనే ఎక్కువ మంది చనిపోయారని అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం విషయం తెలుసుకుని జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది అందరూ హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలను ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పరామర్శించారు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top