ఒక్కొక్కరిది ఒక్కో దీనావస్థ.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. చేతిలో చిల్లిగవ్వలేక రోజు గడవడమే కష్టంగా ఉన్నది కొందరైతే.. వైద్యం, మందుల కొనుగోలు వంటి అత్యవసరాలకూ డబ్బుల్లేక అల్లాడుతున్నవారు మరి కొందరు. కష్టాలు తీరుతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం ఓవైపు ప్రకటనలు చేస్తుండగానే.. మరోవైపు పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా మారుతోంది. కొద్దిరోజులు ఓపిక పడితే పరిస్థితి కాస్త కుదుటపడుతుందని ఇంతకాలం లేని సహనాన్ని తెచ్చిపెట్టుకున్న సాధారణ ప్రజలు... ఇక కరెన్సీ కష్టాలను మోసే పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతుండటంతో జనం సహనం కోల్పోతున్నారు. బ్యాంకుల్లో సిబ్బందితో వాదోపవాదాలకు దిగుతున్నారు. బైఠాయింపులు, ధర్నాలతో నిరసనలు తెలుపుతున్నారు.