పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడిచేశారు. సైనిక దుస్తులు ధరించి, అత్యాధునిక ఆయుధాలతో.. సెంట్రీలను కాల్చేసి స్టేషన్ లోకి చొరబడ్డ ముష్కరులు లోపలి నుంచి కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులతో పోరుకు బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు. ఈ రోజు తెల్లవారుజామున పఠాన్ కోట్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల బృందం.. గుర్దాస్పూర్- జమ్ము హైవేపై వెళుతోన్న ఓ మారుతీ కారును హైజాక్ చేసింది. అదే మార్గంలో జమ్ము వైపు వెళుతోన్న బస్సుపై కాల్పులు జరపగా ఓ ప్రయాణికుడు మరణించాడు. అక్కడి నుంచి హైజాక్ చేసిన కారులో నేరుగా దీనానగర్ పోలీస్ స్టేషన్ వైపునకు బయలుదేరారు. ఉదయం 5:45 గంటలకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ముష్కరులు సెంట్రీలపై కాల్చిచంపారు. స్టేషన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని లోపలి నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కాల్పులు జరుపుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ బలగాలు రంగంలోకి దిగి దీనానగర్ పోలీస్ స్టేషన్ ను చూట్టుముట్టాయి. కేంద్ర మంత్రి ఆదేశాలమేరకు ఎన్ఎస్ జీ కమాండోలు ఘటనా స్థలికి బయలుదేరారు. ఈలోపే దీనానగర్- పఠాన్ కోట్ మధ్య రైల్వేట్రాక్ పై పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను పోలీసులు గుర్తించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దీనానగర్ లోని స్కూళ్లు, కాలేజీలు ఇతర కార్యాలయాలన్నీ మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీఅయ్యాయి. కౌంటర్ ఆపరేషన్ లో ఆర్మీ హెలికాప్టర్ ను కూడా ఉపయోగిస్తున్నారు. ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటు పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఈ ఘటనపై కాసేపట్లో ఢిల్లీలో ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Jul 27 2015 11:59 AM | Updated on Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement