సమస్యలు పరిష్కరించాలి
మహాపాదయాత్రను
జయప్రదం చేయాలి
● హామీలపై రెండేళ్లవుతున్నా
స్పందించిన కూటమి ప్రభుత్వం
● డిమాండ్ల సాధనకు సకుటుంబ ఉద్యమం
● మే 15న మంత్రి లోకేష్ ఇంటికి పాదయాత్ర
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ బడి నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనా పాలన, బడి నిర్మాణం.. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ‘సమగ్రశిక్ష’ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సకుటుంబ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
● మండల వనరుల కేంద్ర(ఎమ్మార్సీ) నిర్వహణలో సమగ్రశిక్ష ఉద్యోగులు కీలకం. మొత్తం కార్యకలాపాలకు సయన్వయకర్తగా ఎంఐఎస్ కో ఆర్డినేటర్ వ్యవహరిస్తారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల నిర్వహణను, క్టస్టర్ రిసోర్సు పర్శన్(సీఆర్పీ) పర్యవేక్షిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా నిలుస్తారు. అలాగే పాఠశాలల్లో క్రాప్టు, డ్రాయింగ్, పీఈటీ తదితర విధుల నిర్వ హణలో పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లుగా సేవలందిస్తారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించే భవనాల నిర్వహణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్ ఇంజినీర్ పర్యవేక్షిస్తారు. ఇన్ని విధాలుగా సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభు త్వం చిన్నచూపు చేస్తోందని సమగ్రశిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము అధికారంలోకి రాగానే...
ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకే్ష్ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్రశిక్ష ఉద్యోగుల తమ డిమాండ్ను అయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అప్పట్లో వారికి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వారి డిమాండ్లను పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు తీర్పును సైతం..
సమగ్రశిక్ష ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్రశిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామంటూ బడ్జెట్ సమావేశాల్లో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించింది. దీంతో సమగ్రశిక్ష ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలు మూలల నుంచి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న విజయవాడలోని ప్రశాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మంత్రి నారా లోకే్ష్ ఇంటికి పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.
సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సిగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా మా సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణం.
– ఎన్. చిన్నయ్య, కడపజిల్లా సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ.
సమగ్రశిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఈ నెల 15వ తేదీన మహా పాద యాత్ర చేపట్టనున్నాం. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో సహా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలి. – చంద్రశేఖర్, కడపజిల్లా సమగ్రశిక్ష కాంట్రాక్టు,
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్


