నిర్లక్ష్యానికి మూల్యం!
అధికారుల్లో గుబులు
మదనపల్లె: చేసిన పాపం ఊరకనే పోదనేది సామెత అయితే.. చేసిన తప్పు రిటైర్మెంట్ అయినా వెంటాడుతుందని, మూల్యం చెల్లించక తప్పదని అన్నమయ్య జిల్లా డిస్కం రిటైర్డ్ సూప రిండెంటింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి ఉదంతం చెబుతోంది. ప్రస్తుతం ఈ ఉదంతం జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు రేపుతోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిల్లా విద్యుత్ శాఖలో రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ (డీఈసీ) కీలకంగా పనిచేస్తుంది. ఈ కమిటీకి చైర్మన్ గా సీనియర్ ఎంపీ మిథున్ రెడ్డి.. కన్వీనర్, మెంబర్ కార్యదర్శిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఇందులో చైర్మన్ పాత్ర కీలకంగా ఉంటుంది. పథకం అమలును పర్యవేక్షించడానికి, కమిటీ సమావేశాల నిర్వహణను నిర్ణయించడం, తీసుకున్న నిర్ణయాలను అమలుపరచడంలో చైర్మన్కు అధికారాలు ఉంటాయి. చైర్మన్ అధ్యక్షతన కమిటీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది.
చైర్మన్ అనుమతి లేకుండానే..
డీఈసీ చైర్మన్ అయిన ఎంపీ మిధున్ రెడ్డి అనుమతి లేకుండానే గత డిస్కం ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి..ఈ ఏడాది మే 12న కమిటీ సమావేశం ఉందని సమాచారం పంపారు. ఈ విషయం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి వారు నిర్ణయించిన తేదీన సమావేశం నిర్వహించాలనే అంశంపై చైర్మన్ తో సంప్రదింపులు జరిపి, అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇవేమీ లేకుండానే చంద్రశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకుని తర్వాత సమాచారం ఇచ్చారు. చైర్మన్ అధ్యక్షతన జరిగే సమావేశమే..ఆయనకు తెలియకుండా నిర్ణయించడం ద్వారా హక్కులు. అధికారాలను కాల రాసేలా ఏకపక్షంగా వ్యవహరించారు.
కలెక్టర్కు ఫిర్యాదు
మే 12న కమిటీ సమావేశం ఉందని అందిన సమాచారంపై ఎంపీ విస్తుపోయారు. తన ప్రమేయం లేకుండా, తన అధ్యక్షతన జరగాల్సిన సమావేశాన్ని తాను నిర్ణయించకుండానే తేదీ, సమయం ఎలా ఖరారు చేశారని ప్రశ్నిస్తూ జిల్లా కలెక్టర్కు మిథున్ రెడ్డి లేఖ రాశారు. విషయాన్ని పరిశీలించి, సమావేశం ఏర్పాటులో సరైన విధానాలను అనుసరించాలని లేఖలో కోరారు.
నా హక్కులకు భంగం
తన హక్కులకు భంగం కలిగించారని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఈిసీ చైర్మన్ అయిన మిథున్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. సీనియర్ ఎంపీ అయిన ఆయన లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్, అలాగే స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ కన్సల్టేటివ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఫిర్యాదుపై స్పీకర్ కార్యాలయం స్పందించింది. హక్కులకు భంగం కలిగించడం, ప్రోటోకాల్ పాటించకవడం వంటి అంశాలపై జిల్లా అధికారుల నుంచి వివరణ కోరింది. దీంతో చర్యలు మొదలయ్యాయి.
రిటైర్డ్ అయినప్పటికీ..
విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఇప్పుడు అధికారులు చూస్తున్నారు. డీఈసీ చైర్మన్ హక్కులను హరించిన ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి ఈ అక్టోబర్ చివర్లో రిటైర్ అయ్యారు. అయితే నిర్లక్ష్యానికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. రిటైరైన తర్వాత అధికారిగా ఉండాల్సిన సౌకర్యాలను నిలిపివేశారు. పెన్షన్ తో పాటు, రిటైర్మెంట్ తో ముడిపడి ఉన్న అన్ని ఆర్థిక అంశాలను నిలుపుదల చేశారు. అలాగే లోక్ సభ స్పీకర్ కార్యాలయం దీనిపై వివరణ కోరెందుకు సంబంధిత అధికారిని హాజరుకావాలని ఆదేశించే అవకాశం ఉంది.
ఒక జిల్లా అధికారి నిర్లక్ష్యంపై చర్యలు చేపట్టడంతో ఇప్పుడు అధికార యంత్రాంగంలో గుబులు పుట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో, ప్రోటోకాల్ కలిగిన ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనలను పాటించకుంటే ఇలాంటి పరిస్థితి తమకు కలగవచ్చన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కిందిస్థాయి అధికారుల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అన్న నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులు ఉన్నారు. ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు కూడా చేపట్టారు. చివరకు ప్రజా ప్రతినిధుల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటంపై చర్యలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులు నిబంధనలను, ప్రతినిధుల హక్కులను గౌరవించేలా పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉంది.
చైర్మన్ అయిన సీనియర్ ఎంపీమిథున్ రెడ్డి అధికారాలనువిస్మరించిన గత డిస్కం ఎస్ఈ
చైర్మన్ అనుమతి లేకుండానే గత మే 12న డీఈసీ సమావేశం
స్పీకర్, కలెక్టర్లకు మిథున్ రెడ్డి ఫిర్యాదు
ఎస్ఈ రిటైర్డ్ అయినప్పటికీఆగని చర్యలు
జిల్లా అధికార యంత్రాంగంలో గుబులు
నిర్లక్ష్యానికి మూల్యం!
నిర్లక్ష్యానికి మూల్యం!


