
సెప్టెంబరు 11, 12వ తేదీల్లో కళా ఉత్సవ్
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా స్థాయి కళా ఉత్సవ్ – 2025 పోటీలు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో రాయచోటి డైట్ ప్రాంగణంలో నిర్వహించ నున్నట్లు అన్నమయ్య, కడప జిల్లాల విద్యాశాఖాధికారులు సుబ్రహ్మణ్యం, షంషుద్దీన్ తెలిపారు. గురువా రం కడప డీఈవో కార్యాలయంలో కళా ఉత్సవ్ – 2025 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సాంప్రదాయ కథ చెప్పడం వంటి 6 విభాగాలలో 12 అంశాల్లో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడం, కళల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు విద్యార్థులకు వేదికను అందించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులు పోటీలకు అర్హులని వివరించారు. వివరా ల కోసం కళా ఉత్సవ్ జిల్లా నోడల్ అధికారి నరసింహారెడ్డి 9440246825ని సంప్రదించాలని సూచించారు.