జల్ జీవన్ ప్రాజెక్టు పూర్తి చేయాలి
చక్రాయపేట : జల జీవన్ మిషన్ కింద చేస్తున్న పనులను ఆగస్టు నాటికి పూర్తి చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు నీటిని అందించాలని నేషనల్ వాష్ ఎక్స్పర్ట్ (కేంద్ర పరిశీలన కమిటి) హర్యాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విజయకుమార్ సంబంధిత పనులు చేస్తున్న మెగా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం మండలంలోని కె.ఎర్రగుడి, కల్లూరుపల్లె గ్రామాల్లో జలజీవన్ మిషన్ కేంద్ర కమిటీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జలజీవన్ మిషన్ ప్రాజక్టు కింద చేస్తున్న పనులను పరిశీలించారు. అనంతరం వారు సర్పంచులు హరిశేఖర్నాయుడు, నాగరత్నమ్మల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సమస్య తదితరాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో బోర్లు వేయాలంటే ఎంత మేర ఖర్చు వస్తుంది. ఎంత లోపల నీరు ఉంది. నీటిలో ఫ్లోరైడ్ ఉందా.. వాటి పరీక్షలు నిర్వహిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. నీటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ విజయ భాస్కర్, డీఈ సాలన్న తదితరులు పాల్గొన్నారు.


