భూదాన్పోచంపల్లి : తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై భవనం పైనుంచి దూకిన విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన కమునూరి శోభ బతుకుదెరువు నిమిత్తం తన ఇద్దరు కుమారులతో కలిసి ఏడాది క్రితం భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖికి వలస వచ్చింది. అక్కడ ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని బాయ్స్ హాస్టల్ నిర్వహిస్తోంది. ఆమె చిన్న కుమారుడు కమునూరి గోపిశంకర్(17) హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గోపిశంకర్ కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటుండంతో సోమవారం తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన గోపిశంకర్ అదే రోజు రాత్రి హాస్టల్ భవనంలోని రెండో అంతస్తు నుంచి కిందికి దూకాడు. దీంతో గోపిశంకర్ తల పగిలి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే అతడిని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స చేసినా ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో మంగళవారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తలించగా.. అప్పటికే గౌరీశంకర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉస్మానియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని దేశ్ముఖికి తీసుకొచ్చారు. బుధవారం మృతుడి తల్లి శోభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు.


