చివ్వెంల(సూర్యాపేట) : టాటా ఏస్ వాహనంలో దైవ దర్శనానికి వెళ్తుండగా డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం జగన్నాయక్తండా శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన జనిగ నర్సింహారావు(36) మేనల్లుడి వివాహం బుధవారం జరగాల్సి ఉండగా.. తమ ఆరాధ్య దైవమైన చివ్వెంల మండలంలోని దురాజ్పల్లి లింగమంతులస్వామికి మొక్కు చెల్లించుకునేందుకు నర్సింహారావుతో పాటు అతడి బంధువులు 18 మంది కలిసి తెల్లవారుజామున టాటా ఏస్ వాహనంలో బయల్దేరారు. మార్గమధ్యలో విజయవాడ–హైదరాబాద్ హైవేపై చివ్వెంల మండలం జగన్నాయక్తండా శివారులోని ముత్యాలమ్మ ఆలయం వద్ద కోడిని కోసి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద టాటా ఏస్ వాహనం ఎక్కుతుండగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనిగ నర్సింహారావు, జనిగ సతీష్ (25), జనిగ లింగయ్య, జనిగ శ్రీను, జనిగ శశికుమార్, ఆవుల గంగయ్యతో పాటు మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు తరలించగా. జనిగ నర్సింహారావు, జనిగ సతీష్ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడు నర్సింహరావు తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కనకరత్నం తెలిపారు. మృతుడు నర్సింహారావు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.. మరో మృతుడు సతీష్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ ఘటనలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఫ టాటా ఏస్ వాహనాన్ని
వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం
ఫ ఇద్దరు వ్యక్తులు మృతి..
పలువురికి గాయాలు
ఫ పెళ్లింట్లో విషాదఛాయలు


