గుర్రంపోడు : బత్తాయి రైతుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఓ సంఘం అవసరమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నీలగిరి మహిళా సమాఖ్య కేంద్రంలో బత్తాయి రైతు పరస్పర సేవా సహకార సంఘం, ప్రతిభ బఝెటెక్ ప్రైవేట్ లిమిడెట్ ఆధ్వర్యంలో బత్తాయి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. బత్తాయి రైతుల సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. నాసిరకం పురుగు మందులు, దళారులు పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వడం లేదని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయమై ఎస్పీ గారితో మాట్లాడినట్లు తెలిపారు. దళారుల నుంచి సత్వరమే రైతులకు డబ్బులు ఇప్పించాలని అధికారులకు సూచించారు. ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్రెడ్డి ఈ అవగాహన సదస్సు నిర్వహించేందుకు ముందకురావడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని బత్తాయి రైతుల కోసం నిర్వహించాలని కోరారు. ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తగా రైతులకు సరైన సాగు విధానం నేర్పడం కోసమే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతుల సమస్యలు పూర్తిగా అవగాహన చేసుకుని పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలో ఐదు తోటలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ బత్తాయి రైతు, ఛాంపియన్ అవార్డు గ్రహీతలు లోకసాని పద్మారెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, కొణతం చంద్రారెడ్డి, మల్గిరెడ్డి భాస్కర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిని సైతం సన్మానించారు. బత్తాయి రైతు పరస్పర సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురుగురు శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు జొన్నగడ్డల ఉపేందర్రెడ్డి, కార్యదర్శి దేవిరెడ్డి అశోక్రెడ్డి, వాసుదేవరెడ్డి, గణేష్రెడ్డి, గుర్రం శ్రీనివాస్రెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఫ మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి


