భూదాన్పోచంపల్లి : మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకొని విద్యార్థులు గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు అన్నారు. బుధవారం భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘ట్రినెక్సియా–2026’ పేరుతో టెక్ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆవిష్కరణలు సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపేలా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండి వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాలని అన్నారు. టెక్ఫెస్ట్లు విద్యార్థుల భవిష్యత్తు, కెరీర్కు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు. ఈ టెక్ఫెస్ట్లో ఐడియాథాన్, ఈ–స్పోర్ట్స్, టెక్పల్స్, డీబగ్గింగ్ ఛాలెంజ్, బ్లిట్జ్ అనే ఐదు అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విజేత విద్యార్థులకు రూ.25వేల నగదు పురస్కారాలతో పాటు సర్టిఫికెట్లు, మెమొటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


