నూజివీడు: ఏలూరు జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరానికి రూ.472.5 కోట్ల లక్ష్యం కాగా రూ.364.6 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కే శ్రీనివాసరావు పేర్కొన్నారు. నూజివీడులోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చిన ప్రజలకు సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని పరిశీలించారు. అలాగే రికార్డులను తనిఖీ చేసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు గతేడాది టార్గెట్ రూ.69.48 కోట్లు కాగా రూ.54.55 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. 1983 ముందు నుంచి ఉన్న రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, దీనివల్ల భూముల వివరాలన్నీ ప్రజలకు సులువుగా అందుబాటులోకి వస్తాయన్నారు. వివాహ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకుంటే ప్రక్రియ అరగంటలో పూర్తవుతుందన్నారు. అపార్ట్మెంట్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు గతంలో కంటే ప్రస్తుతం తగ్గాయని, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం యథావిధిగా ఉన్నాయన్నారు. నూజివీడు పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద అసౌకర్యాలను గుర్తించామని, త్వరలోనే మరొక సౌకర్యవంతమైన భవనంలోనికి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మార్చడం జరుగుతుందన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ నడింపల్లి ఫణిసీతారామరాజు ఉన్నారు.


