పాలకొల్లు సెంట్రల్: రైతులు ధాన్యం విక్రయించేందుకు రైస్ మిల్లులకు పంపాలంటే ట్రక్ షీట్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని లంకలకోడేరు గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యం తోలిన వెంటనే నగదు జమచేస్తామని, రవాణా చార్జీలు కూడా చెల్లిస్తామన్నారు. ట్రక్ షీట్ లేకుండా పంపిన ధాన్యాలకు నగదు పడడం ఆలస్యమవుతుందన్నారు. ఆర్డీవో దాశి రాజు మాట్లాడుతూ క్వింటా ధాన్యం మద్దతు ధర కామన్ రకానికి రూ.2,369, గ్రేడ్ ఏ రకానికి రూ.2,389 నిర్ణయించడం జరిగిందన్నారు. గోనె సంచులు రైతు సేవీ కేంద్రాల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయి డీఎం ఇబ్రహీం, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, ఏడీఏ మురళీకృష్ణ, అంగర రామ్మోహన్, పాముల రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.


