
ఆక్వాకు వాతావరణ గండం
గణపవరం : పూటకో రకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గుదిబండలా తయారైంది. ఈ వాతావరణం రొయ్య సాగుకు పూర్తి ప్రతికూలం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల దారుణంగా పడిపోయిన రొయ్యల ధరలు కొద్దిగా పెరిగి ఆక్వా సాగు కుదుట పడుతున్న సమయంలో గత రెండు వారాలుగా మళ్లీ రొయ్య ధర తగ్గిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో గత పది రోజులుగా నిలకడలేని వాతావరణం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పగలు ఉక్కబోత, విపరీతమైన ఎండలు ఓ పక్క, సాయంత్రానికి మబ్బులు కమ్మి, వర్షపు జల్లులు మరో పక్క ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి.
ఈ సమస్యలకు తోడు ఎడాపెడా విధిస్తున్న విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజిన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయిల్ ఇంజిన్ల వినియోగానికి రోజూ వేల రూపాయల డీజిల్ కొనాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో వర్షాలతో చల్లబడిపోగా, జూన్ విపరీతమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో మొదలైంది. ఉక్కబోత కారణంగా రొయ్యల చెరువుల్లో డీవో సమస్య ఏర్పడి సరిపడా ఆక్సిజన్ అందక నీటి ఉపరితలంపై తేలియాడుతున్నాయి. ఈ సమస్య మరీ తీవ్రమైతే రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో రైతులు ఆఘమేఘాల మీద రొయ్యల పట్టుబడి చేసి, నష్టాల పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా 50 శాతం చెరువుల్లో అంటే 1.25 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో జూన్లో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో రొయ్యలు అర్ధాంతరంగా పట్టుబడి చేసినట్లు అంచనా.
ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోవాలంటే..
రొయ్య సీడ్ నాణ్యత కలిగి ఉండాలి. నీటి పీహెచ్ స్థాయి సరైన మోతాదులో ఉండాలి. నిరంతరం ఆక్సిజన్ స్థాయిని సరి చూసుకుంటూ ఉండాలి. నీటి క్షార స్వభావం, నీటి కాఠిన్యం సరైన స్థాయిలో ఉండేలా చూడాలి. చెరువులో ప్రమాదకరమైన విష వాయువులు అమ్మోనియా నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి తయారవకుండా చర్యలు తీసుకోవాలి. చెరువుల్లో రొయ్య పిల్ల సాంద్రతను బట్టి పాక్షిక పట్టుబడి చేసుకుంటే మిగిలిన రొయ్యలు ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్చగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
మత్స్యశాఖ అధికారుల సూచనలు
చెరువుల్లో ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీ సైక్లింగ్ చేయాలి. ఆక్సిజన్ లోపం నివారణకు పొటాషియం పర్మాంగనేట్ సిద్ధంగా ఉంచుకుని, అవసరం మేరకు చెరువుల్లో చల్లుతుండాలి. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినని కారణంగా పరిమితంగా మేతలు వేస్తుండాలి. ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో చెరువుల్లో మేత, సేంద్రియ ఎరువులను వేయడం పూర్తిగా మానేయాలి. చెరువుల్లో మినరల్స్ ఎక్కువగా వినియోగించకూడదు. నీటి పరీక్షలు చేయించి చెరువులలో అమ్మోనియా స్థాయిని నిర్ధారించుకోవాలి.
పగలంతా ఎండ, సాయంత్రం భారీ వర్షాలతో అనర్థం
విద్యుత్ కోతలతో ఆయిల్ ఇంజిన్లు వాడుతున్న రైతులు

ఆక్వాకు వాతావరణ గండం