
వైఎస్ జగన్తో చినమిల్లి భేటీ
భీమవరం: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తనను సమన్వయకర్తగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి భీమవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జ్ గూడూరి ఉమాబాల, పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, ఎంపీపీ పేరిచర్ల విజయనర్సింహరాజు, పార్టీ నాయకులు మేడిద జాన్సన్, ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, గాదిరాజు రామరాజు, చవాకుల సత్యనారాయణ, కోడె యుగంధర్, జల్లా కొండయ్య తదితరులున్నారు.
చెవిరెడ్డి అరెస్టు అన్యాయం
భీమవరం: వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టు అక్రమమని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. భాస్కరరెడ్డి రాజకీయాల పట్ల నిబద్ధత, నిజాయితీ గల నాయకుడని,, కూటమి ప్రభుత్వం జైలుకు పంపాలనే దుర్బుద్ధితో మద్యం అక్రమ కేసులో ఇరికించి వేధింపులకు పాల్పడేందుకు అరెస్టు చేశారన్నారు. భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్రెడ్డితో పాటు మరో నలుగురుపై కేసు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు.
వ్యవసాయంలో
సాంకేతికత వినియోగించాలి
భీమవరం: వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి రైతులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన యంత్ర పరికరాలు, రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆహార కొరత స్థాయి నుంచి రైతులు విప్లవాత్మకమైన సాగు ద్వారా ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. జిల్లాకు కిసాన్ డ్రోన్ గ్రూపులకు 80 శాతం సబ్సిడీతో 41 డ్రోన్లను కేటాయించినట్లు చెప్పారు. సన్న, చిన్నకారు రైతులకు రూ.8.99 కోట్ల విలువైన వ్యక్తిగత యంత్ర పరికరాలకు రూ.3.84 కోట్లు రాయితీపై పంపిణీ చేశామన్నారు.
డీఎస్సీకి 1,161 మంది హాజరు
భీమవరం: జిల్లా వ్యాప్తంగా అయిదు పరీక్షా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 1,161 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. ఉదయం పరీక్షకు 580 మందికి 567 మంది హాజరుకాగా.. మధ్యాహ్నం పరీక్షకు 601 మందికి 594 మంది హాజరయ్యారన్నారు.
సమగ్రశిక్ష సిబ్బంది బదిలీలకు అవకాశం
భీమవరం: జిల్లాలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టులోని కాంట్రాక్ట్ సిబ్బంది బదిలీలకు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ తెలిపారు. సమగ్రశిక్ష ప్రాజెక్టులో కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేస్తున్న ఐఇఆర్పీ, పీటీఐ, సీఆర్ఎంటీ, మండల స్థాయి అకౌంటెంట్, సైట్ ఇంజనీర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మేసెంజర్స్, ఆఫీసు సబార్టినేట్స్ తదితర సిబ్బంది రిక్వెస్ట్, సరస్పర ప్రతిపాదనల దరఖాస్తులను ఈనెల 19 నుంచి 21 లోగా సమగ్రశిక్ష ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలని శ్యామ్సుందర్ తెలిపారు.
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
భీమవరం (ప్రకాశంచౌక్): యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ క్యాంపెయిన్ కార్యకలాపాలపై కలెక్టర్ సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు.