సాగుకు సిద్ధం.. సాయం శూన్యం | - | Sakshi
Sakshi News home page

సాగుకు సిద్ధం.. సాయం శూన్యం

Jun 16 2025 7:13 AM | Updated on Jun 16 2025 7:13 AM

సాగుక

సాగుకు సిద్ధం.. సాయం శూన్యం

ఏలూరు (మెట్రో): ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతులకు కూటమి ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడం లేదు. అరక చేతబట్టి పొలం బాట పట్టిన రైతులు దిగాలుతో వ్యవసాయ పనులు చేపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా రైతులకు ఎలాంటి పెట్టుబడి సాయం అందించకుండా వ్యవసాయం దండగ అనే రీతిలోనే వ్యవహరిస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులు చేసి వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నామని వాపోతున్నారు.

గత ప్రభుత్వంలో రైతే రాజుగా..

రాష్ట్రంలో రైతే రాజుగా భావించిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్నదాతల సంక్షేమానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ఏటా సీజన్‌ ప్రారంభంలోనే ఆర్థిక సాయం అందించారు. ఇలా ఏలూరు జిల్లాలో రైతులకు 2019 నుంచి 2023 వరకు రూ.1,339.45 కోట్ల సాయం అందించారు. అయితే ప్రస్తుత కూటమి సర్కారు ఎన్నికల హామీ ల్లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేల చొప్పున అందించాల్సి ఉండగా.. ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదు. తా జాగా ఈనెల 20 నుంచి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తామని కూటమి నాయకులు ప్రక టించారు. అయితే ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఎప్పుడు పథకాన్ని అమలు చేసి సాయం అందిస్తారని రైతులు నిట్టూరుస్తున్నారు.

13,027 మందికి ఈకేవైసీ

జిల్లావ్యాప్తంగా 1,62,085 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లెక్కలు తేల్చారు. రైతులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 13,027 మంది రైతుల ఖాతాల ఈకేవైసీ మాత్రమే పూర్తిచేశారు.

రైతుల ఇక్కట్లు

గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. రైతులు సీజన్‌ ఆరంభంలో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే పంట చేతికొచ్చాక కూడా ఆ అప్పు తీర్చే పరిస్థితి ఉండటం లేదు. ప్రస్తుతం ఖరీఫ్‌ పనులు చేపడుతున్న రైతులు చేతిలో డబ్బులు లేక మరోమారు అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు.

సార్వా సాగేనా..?

ఖరీఫ్‌ పనులు ప్రారంభం

రైతులను పట్టించుకోని ప్రభుత్వం

అన్నదాత సుఖీభవ సాయం ఎప్పటికో?

జిల్లాలో 99,512 హెక్టార్లలో సాగు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీజన్‌ ఆరంభంలోనే సాయం

గత ప్రభుత్వంలో రైతు భరోసా సాయం

సంవత్సరం రైతులు లబ్ధి (రూ.కోట్లలో)

2019 2,24,016 302.42

2020 2,13,950 288.83

2021 1,90,729 257.48

2022 1,87,950 253.73

2023 1,98,179 236.99

సాగుకు సిద్ధం.. సాయం శూన్యం 1
1/1

సాగుకు సిద్ధం.. సాయం శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement