
సాక్షి కార్యాలయంపై దాడికి నిరసన
యలమంచిలి: ఏలూరు సాక్షి కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అను చరుల దాడిని ఖండిస్తూ పాలకొల్లు ప్రెస్క్లబ్ నాయకులు శుక్రవారం పాలకొల్లు తహసీల్దార్ వై.దుర్గా కిషోర్కు వినతిపత్రం ఇచ్చారు. పత్రికా సేచ్ఛకు విఘాతం కలిగిస్తున్న వారిని అరెస్ట్ చేయాలని కోరారు. ఇలంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. నిరసన తెలిపిన వారిలో పాలకొల్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విన్నకోట వెంకటరమణ, కార్యదర్శి ఎం.వి.సాంబశివరావు, ఏపీడబ్ల్యూజే జిల్లా కోశాధికారి ముత్యాల శ్రీనివాస్, ఏపీడబ్ల్యూఈ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జక్కంశెట్టి శ్రీనివాసరావు, పీటీ వెంకటేశ్వరరావు, మద్దా విజయ లాజరస్, మండెల అప్పలరాజు, కర్రా నాయుడు, బుడ్డిగ గోపి, బండి శ్రీనుబాబు, కాపిశెట్టి గోపాలరావు, కారుమంచి రాజగోపాల్, టి.రాఘవ, గుడాల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
పన్ను వసూళ్లలో ప్రథమ స్థానం
తాడేపల్లిగూడెం (టీఓసీ): రాజమండ్రి రీజియన్ లో ఆరు పురపాలక సంఘాల పరిధిలో 2024– 25 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్నులు వసూలులో రాష్ట్రంలోనే రీజియన్ ప్రథమ స్థానం సాధించింది. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో రీజినల్ డైరక్టర్(రాజమండ్రి) సీహెచ్ నాగ నరసింహరావుకు సత్కారం చేశారు. పాత పశ్చిమ గోదావరి జిల్లా పురపాలక సంఘాల కమిషనర్లు హాజరయ్యారు. పన్ను వసూలులో తాడేపల్లిగూడెం మూడో స్థానం సాధించడంతో కమిషనర్ యేసుబాబును సత్కరించారు.
జాతీయ లోక్ అదాలత్ వాయిదా
ఏలూరు (టూటౌన్): మే 10న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ జూలై 5కి వాయిదా వేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. కక్షిదారులు ఈ మార్పును గమనించాలన్నారు.
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర కమిటీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ఇంటలెక్చువల్స్ ఫోరం అధికార ప్రతినిధిగా ఈదా యహోషువా, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ జాయింట్ సెక్రటరీగా ఇనపర్తి రాహుల్, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా గూడూరి ఉమాబాల, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీలుగా వీరమల్లు లక్ష్మి నారాయణ, ఇంజేటి జాన్ కెన్నడీ, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా కరిమెరక రామచంద్రరావు నియమితులయ్యారు.
పన్ను వసూళ్లు, చెత్త సేకరణలో అవార్డులు
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్ర స్థాయిలో పన్ను వసూళ్లు, ఇంటింటా చెత్త సేకరణలో పశ్చిమగోదావరి జిల్లా రెండు అవార్డులను సొంతం చేసుకోవడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులను, సిబ్బందిని కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించారు. శుక్రవారం కలెక్టరేట్ చాంబర్లో కలెక్టర్ను డీపీఓ బి.అరుణ శ్రీ కలుసుకుని అవార్డుల విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు.

సాక్షి కార్యాలయంపై దాడికి నిరసన