నిజాయతీగా నిలబడ్డారు | - | Sakshi
Sakshi News home page

నిజాయతీగా నిలబడ్డారు

Mar 29 2025 1:12 AM | Updated on Mar 29 2025 1:10 AM

శనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2025

ప్రాణం ఉన్నంత వరకూ

వైఎస్సార్‌సీపీలోనే..

మా కుటుంబానికి వైఎస్సార్‌ అంటే ప్రాణం.. నా భర్త చివరి వరకూ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడిచారు.. ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్‌ వెంటే ఉంటాను తప్ప పార్టీని మాత్రం వీడను.. అంటూ తేల్చిచెప్పారు యలమంచిలి మండలం గుంపర్రు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంబాల సత్యశ్రీ. ఎంపీపీ ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం మండలపరిషత్‌ కార్యాలయానికి వచ్చిన ఆమెను.. మీరు కనిపించడం లేదని మీ కుమార్తె ఫిర్యాదు చేశారంటూ పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబసభ్యుల ద్వారా తమకు అనుకూలంగా ఓటు వేయాలని కూటమి నేతలు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోతానే తప్ప పార్టీని వీడనని సత్యశ్రీ తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు ఆమెను తిరిగి మండలపరిషత్‌ కార్యాలయం వద్ద దించి వెళ్లగా జరిగిన సంఘటనను సహచర సభ్యులకు సత్యశ్రీ కన్నీటి పర్యంతమవుతూ వివరించారు.

సాక్షి, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, యలమంచిలి ఎంపీపీ పదవులకు ఈనెల 27న జరగాల్సిన ఉప ఎన్నికలను కూటమి నేతల ఆదేశాలతో పచ్చమూకలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారానికి వాయిదా పడిన ఎన్నికల్లో అయినా ఎంపీపీ పదవులు దక్కించుకోవాలని ఆయా నియోజకవర్గ నేతలు పావులు కదిపినా ఫలితం లేకపోయింది. తమకు సరిపడినంత మంది సభ్యుల బలం లేకపోయినా భయపెట్టో, ప్రలోభాలకు గురిచేసి అయినా తమకు అవసరమైన మెజార్టీ సభ్యులను లాక్కునేందుకు చేసిన కుయుక్తులు ఫలించలేదు. వాస్తవానికి ప్రస్తుతం అత్తిలి మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీకి 13 సభ్యుల సంఖ్యాబలం ఉండగా, కూటమికి ఆరుగురే ఉన్నారు. యలమంచిలిలో 17 మందికి గాను వైఎస్సార్‌సీపీకి 12 మంది ఉండగా, కూటమికి ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ సభ్యులే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలుగా ఎన్నిక కావడం లాంఛనమే. గతంలోని పెద్ద మనుషుల ఒప్పందాల ప్రకారం అత్తిలి ఎంపీపీగా రంభ సుజాత, వైస్‌ ఎంపీపీగా గుమ్మంపాడు ఎంపీటీసీ సభ్యుడు అద్దంకి శ్రీను వైస్‌ ఎంపీపీగా, యలమంచిలి ఎంపీపీగా వినుకొండ ధనలక్ష్మి ఎన్నిక కావాల్సి ఉంది.

ఏదోక విధంగా లాక్కోవాలని..

ఎంపీపీ పదవులు దక్కించుకునేందుకు సరిపడినంత బలం లేకపోయినా ఏదోక విధంగా తమ కై వసం చేసుకోవాలని ఆయా నియోజకవర్గాలకు చెందిన కూటమి నేతలు పావులు కదిపారు. మెజార్టీ సాధన కోసం తమకు అవసరమైనంత మంది సభ్యులను లాక్కునేందుకు మధ్యవర్తుల ద్వారా రూ.లక్షల్లో ఆశ చూపారు. మీరు సూచించిన వారి వద్ద డబ్బులు ఉంచుతామని, ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటేసి ఆ డబ్బును తీసుకువెళ్లవచ్చని చెప్పారు. కాంట్రాక్టు వర్కులు ఇస్తామని, రానున్న స్థానిక సంస్థల్లో సర్పంచులుగా అవకాశం కల్పిస్తామని, నామినేటెడ్‌ పదవులు వేయిస్తామంటూ రకరకాలుగా ఆశ చూపారు. మీ పార్టీలోని కొంతమంది మాకు టచ్‌లో ఉన్నారని, మీరు వస్తే సరిపోతుందంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. అత్తిలిలో రూ.10 లక్షల వరకు ఆఫర్‌ ఇచ్చినట్టు ఎంపీటీసీ సభ్యుడు ఒకరు తెలిపారు. చివరకు బ్లాంక్‌ చెక్‌ కూడా ఇస్తామని మధ్యవర్తుల ద్వారా కబురు పంపారని చెప్పారు.

కుయుక్తులు ఫలించకపోవడంతో..

తమ కుయుక్తులు ఫలించకపోవడంతో కూటమి నేతలు చివరికి బెదిరింపులకు దిగారు. అత్తిలికి కాబోయే ఎంపీపీ రంభ సుజాతకు చెందిన పెట్రోల్‌ బంకులపై విజిలెన్స్‌ అధికారులతో తనిఖీలు చేయించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎంత ఒత్తిడి చేసినా వైఎస్సార్‌సీసీ సభ్యులు ఎక్కడా వారి ప్రలోభాలకు లొంగకుండా నీతిగా, నిజాయతీగా నిలబడ్డారు. తాము వైఎస్సార్‌సీపీ ద్వారా గెలిచామని, ఆ పార్టీలోనే కొనసాగుతామని తేల్చిచెప్పారు. చేసేది లేక ఓటమి నుంచి తప్పించుకునేందుకు కూటమి మూకలు దౌర్జన్యకాండ సాగించారు. గురువారం అత్తిలిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యులు బయటకు రాకుండా నిర్బంధించగా.. శుక్రవారం సైతం సభ్యులు ఎవరూ ఎన్నికకు హాజరుకాకుండా అత్తిలికి వచ్చే దారులన్నింటినీ దిగ్బంధించారు. యలమంచిలిలో ముందు రోజు మాదిరి రెండో రోజు కూడా హైడ్రామాను కొనసాగించి రెండు చోట్లా ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారు.

న్యూస్‌రీల్‌

కుట్రలను చీల్చుకుంటూ..

ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రలోభాలు, బెదిరింపుల పర్వం

అత్తిలిలో ఎంపీటీసీ సభ్యులకు రూ.10 లక్షల వరకు ఆఫర్‌

యలమంచిలిలోనూ ప్రలోభాల ఎర

తలొగ్గని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు

విశ్వసనీయత వెంటే నడిచిన వైనం

బ్లాంక్‌ చెక్‌ ఇస్తామని వల

జెంటిల్‌మెన్‌ ఒప్పందం ప్రకారం ఇప్పుడు నేను ఎంపీపీగా ఎన్నిక కావాల్సి ఉంది. వైఎస్సార్‌సీపీ గెలవకూడదన్న ఉద్దేశంతో మా సభ్యులను లాక్కునేందుకు కూటమి నాయకులు ఎన్నో అడ్డదారులు తొక్కారు. మా సభ్యులకు బ్లాంక్‌ చెక్‌లు ఇస్తామని, ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా మా వాళ్లు అందరూ ఎంతో నిజాయతీగా నిలబడ్డారు.

– రంభ సుజాత, ఎంపీటీసీ సభ్యురాలు, అత్తిలి

విలువల్ని వదిలేశారు

ఎన్నికల్లో కూటమి ఏ మాత్రం గెలిచే అవకాశం లేకపోయినా ప్రజాస్వామ్య విలువల్ని ఆ పార్టీలో నేతలు పూర్తిగా వదిలేశారు. మా ఎంపీటీసీ సభ్యులను మభ్యపెట్టి ఎంపీపీ పదవిని కాజేయాలని చూశారు. వారు గెలవమని తెలిసి నేను ఎంపీపీ కాకుండా ఎన్నికను అడ్డుకున్నారు.

– వినుకొండ ధనలక్ష్మి,

ఎంపీటీసీ సభ్యురాలు, యలమంచిలి

నిజాయతీగా నిలబడ్డారు 1
1/5

నిజాయతీగా నిలబడ్డారు

నిజాయతీగా నిలబడ్డారు 2
2/5

నిజాయతీగా నిలబడ్డారు

నిజాయతీగా నిలబడ్డారు 3
3/5

నిజాయతీగా నిలబడ్డారు

నిజాయతీగా నిలబడ్డారు 4
4/5

నిజాయతీగా నిలబడ్డారు

నిజాయతీగా నిలబడ్డారు 5
5/5

నిజాయతీగా నిలబడ్డారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement