స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదులు

Jul 11 2023 1:20 AM | Updated on Jul 11 2023 1:45 PM

- - Sakshi

సాక్షి, భీమవరం: భీమవరం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 18 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ యు.రవిప్రకాష్‌ అర్జీదారుల సమస్యల తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు. స్పందన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించామని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

భీమవరం వన్‌టౌన్‌కు చెందిన వ్యక్తి తనను 2020లో యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌, మరికొందరు కలిసి రూ.19 లక్షల వరకు మోసం చేశారని దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చార్జిషీట్‌ వేయలేదని ఫిర్యాదు చేశారు.

పోడూరుకు చెందిన మహిళ తనకు ఇజ్రాయిల్‌ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకుని నకిలీ వీసా పత్రాలు ఇచ్చి మోసం చేశారని ఫిర్యాదు చేసింది.

వీరవాసరానికి చెందిన మహిళ తనకు పక్క ఇంటి వారితో సరిహద్దు గొడవలున్నాయని, దౌర్జన్యం చేస్తున్నారని న్యాయం చేయాలని కోరారు.

మొగల్తూరుకి చెందిన మహిళ ఒక వ్యక్తి తన వెంటపడుతూ వేధిస్తుండటంతో పాటు తనకు పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నాడని, రక్షణ కల్పించాలని కోరింది.

వీరవాసరానికి చెందిన మహిళ తనను భర్త, అత్తమామలు, మరుదులు వేధిస్తుండగా గృహహింస కేసు పెట్టానని, వారంతా రాజీకి రావడంతో కేసు వాపసు తీసుకున్న తర్వాత తిరిగి వేధిస్తున్నారని ఎస్పీ వద్ద వాపోయింది.

స్పందన కార్యక్రమం అనంతరం ఎస్పీ రవిప్రకాష్‌ పోలీస్‌ క్వార్టర్‌లో ఏర్పాటుచేసిన జిల్లా పోలీసు వెల్ఫేర్‌ ఆస్పత్రిని సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement