87.25శాతం
జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. మొత్తం 87.25% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండో విడతలో భాగంగా ధర్మసాగర్ హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 1,25,735 ఓటర్లు ఉండగా.. 1,09,703 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 87.25గా పోలింగ్ శాతం నమోదైంది.
ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు..
రెండో విడత పోలింగ్కు జిల్లాలోని ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఓటర్లు ఉదయం నుంచే పోటెత్తారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద బారులుదీరారు. ఓటు వేసేందుకు ఓపికతో క్యూ లైన్లో నిలబడ్డారు. ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది. అనంతరం భోజన విరామం తర్వాత వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
మళ్లీ మహిళలు తక్కువే..
రెండో విడత పోలింగ్లో కూడా మహిళల పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. ఓటర్లపరంగా పురుషులకన్నా సుమారు 3వేలకు పైగా.. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అయితే పోలింగ్ శాతం చూస్తే మాత్రం పురుషుల కంటే మహిళా ఓట్లు రెండు శాతం తక్కువగా పోలింగ్కు హాజరయ్యారు.
3.3 శాతం అధికం
తొలి విడత జిల్లాలో 83.95 పోలింగ్ శాతం నమోదవ్వగా రెండో విడతలో 87.25 శాతంగా పోలింగ్ నమోదైంది. దీంతో మొదటి విడత కంటే రెండో విడతలో సుమారు మూడు శాతం ఎక్కువ పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
పర్యవేక్షించిన కలెక్టర్
హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో జరుగుతున్న పోలింగ్ను కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యవేక్షించారు. హసన్పర్తి, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలను స్వయంగా సందర్శించి పోలింగ్ సరళి గురించి అధికారులకు సూచనలిచ్చారు.
మొదటి విడత కన్నా
3.3 శాతం అధికం
పోలింగ్ ప్రారంభానికి
ముందే బారులుదీరిన ఓటర్లు


