అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
వరంగల్ అర్బన్: అనధికారిక భవన నిర్మాణాలు, అక్రమ కట్టడాలపై గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తుదారులతో కార్యాలయ ఆవరణంతా కిటకిటలాడింది. గ్రీవెన్స్ సెల్కు మొత్తం 117 ఫిర్యాదులు అందగా.. టౌన్ ప్లానింగ్ విభాగానికి 63 వచ్చాయి. నగరంలో ఎంత పెద్ద మొత్తంలో అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నాయో ఈ ఫిర్యాదుల సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. మౌలిక వసతుల కల్పన కోసం 41, పన్నుల విభాగానికి 4, ప్రజారోగ్య సెక్ష న్కు 3, నీటి సరఫరాకు 5, ఉద్యాన వన విభాగానికి 1 చొప్పున ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఓ రామకృష్ణ పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● వరంగల్ దేశాయిపేట చార్లెస్ కాలనీ రోడ్డు–1లో డ్రెయినేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఆర్గనైజర్స్ కోరారు.
● వరంగల్ 25వ డివిజన్ ఎల్లంబజార్ రిషి స్కూల్ లైన్లో రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, కొత్తగా నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు.
● మట్టెవాడ 13–3–52 వద్ద తాగునీటి పైపులైన్ నెల రోజులుగా లీకేజీగా మారి నీరు వృథాగా పోతోందని, రోడ్డు దెబ్బతింటుందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● 19వ డివిజన్ గాంధీనగర్లో విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని రామా యాదగరి విజ్ఞప్తి చేశారు.
● 2028లో లక్ష్మీటౌన్ షిప్ నుంచి ఆరేపల్లి వరకు రూ.4 కోట్లతో రోడ్డు విస్తరణ, అభివృద్ధి చేపట్టారని, కానీ కొన్నేళ్లకు రోడ్డు దెబ్బతిందని మరమ్మతులు చేపట్టాలని ఇట్యాల సురేశ్కుమార్ కోరారు.
● వరంగల్ చింతల్లో నల్లాలు, డ్రెయినేజీలు లేవని, రోడ్లు నిర్మించాలని మహ్మద్ అంకూస్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
● వరంగల్ 28వ డివిజన్ విశ్వకర్మ వీధి, చకిలం ఉపేందర్ వీధిలో సీసీ రోడ్డు నిర్మించాలని కార్పొరేటర్ గందె కల్పన దరఖాస్తు అందించారు.
● 23వ డివిజన్ కొత్తవాడ 11–25–763 నల్లా కనెక్షన్ తొలగించాలని కొమిటి శ్రీనివాస్ కోరారు.
● 62వ డివిజన్ విష్ణుపురి రెహ్మత్ నగర్ మరుగుదొడ్ల నుంచి మల వ్యర్థాలను నేరుగా డ్రెయినేజీలకు పంపిస్తుండడంతో దుర్వాసన వస్తోందని మాట్ల రాజశేఖర్ ఫిర్యాదు చేశారు.
● హంటర్ రోడ్డులోని వేదవతి నిలయం అపార్ట్మెంట్కు సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● హనుమకొండ ఆర్టీసీ కాలనీలో రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని రాంచందర్ పేర్కొన్నారు.


