ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
దుగ్గొండి: రెండో విడత పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా బ్యాలెట్ పేపర్లు, బాక్సులు, ఓటరు జాబితాలు, ఇతర స్టేషనరీ ప్యాకింగ్ విధానాన్ని పరిశీలించారు. మండల పరిధిలోని గ్రామాలు, వార్డులు, సిబ్బంది కేటాయింపు, రూట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ఓటు వేసే ప్రదేశంలో వెలుతురు బాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓటింగ్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. దేశాయిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను తహసీల్దార్ రాజేశ్వర్రావుకు అప్పగించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా నోడల్ అధికారి శ్రీనివాసరావు, ఆర్డీఓ ఉమారాణి, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గీసుకొండలో ఏర్పాట్ల పరిశీలన
గీసుకొండ: గీసుకొండ, సంగెం, నల్లబెల్లి, దుగ్గొండి, మండలాల్లో ఈ నెల 14న గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద గీసుకొండ మండలంలోని పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, హరిత పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అధికారుల రాకపోకలు సజావుగా సాగడానికి అవసరమైన క్యూలైన్లు, సహాయక కేంద్రాలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, విద్యుత్, ఇంటర్నెట్, భద్రత తదితర విషయాలపై అప్రమత్తంగా ఉండాలని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. మండలంలో ఏర్పాటు చేయనున్న రెండు హరిత పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వరంగల్ ఆర్టీఓ సుమ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలి
న్యూశాయంపేట: మొదటి విడతలో ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్ప నను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులకు గుర్తుచేశారు. అధికారులు పోలింగ్ రోజున ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


