ధర్మసాగర్: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్లైన్ మోటివేషనల్ సెషన్ను పరిశీలించారు. విద్యార్థులు అత్యధిక మార్కులు పొందేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఎల్కుర్తి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నరసింగరావుపల్లి గ్రామానికి వెళ్లి మూతబడిన గ్రామ ప్రాథమిక పాఠశాల గురించి నర్సింగరావు సర్పంచ్, ప్రజల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న విద్యా సంవత్సరం 2026–27కు ఆ పాఠశాల తెరుచుకునేట్లుగా కార్యాచరణ చేసేందుకు గ్రామస్తులతో మాట్లాడారు. ఆయన వెంట మండల విద్యాధికారి రాంధన్ ఉన్నారు.


