మేయర్ గుండు సుధారాణి
రామన్నపేట: ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 5 కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ నుంచి హనుమకొండ వేయిస్తంభాల ఆలయం వరకు నిర్వహించిన 5కే రన్ను వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్పాయ్తో కలిసి మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతీరోజు ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ హెల్త్ రన్ నిర్వహించామని తెలిపారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు 5 కే రన్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచేందుకు ఇవి దోహదపడతాయన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని, ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో విజయాలు సాధించగలమని తెలిపారు. అనంతరం అధికారులు, యువత, ప్రజలు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ జోషి, బస్వరాజు కుమారస్వామి, జన్ను శిభారాణి, అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీహెచ్ఎంఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, హనుమకొండ డీవైఎస్ఓ అశోక్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.


