
స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ షురూ
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) విడుదల చేశారు. వరంగల్–8, హనుమకొండ–16, మహబూబాబాద్–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థానంలో నిలిచాయి. మొబైల్ ఫోన్లో విద్యార్థితోపాటు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్లో వేర్వేరుగా అటెండెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్ ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఫొటో అప్లోడ్ అయ్యేందుకు అరగంట సమయం పట్టిందని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. సాంకేతిక సమస్య ఇలాగే కొనసాగితే అటెండెన్స్ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు.