
మల్లన్న ఆలయంలో మిథున సంక్రమణ పూజలు
ఐనవోలు: మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం అర్చకులు మాస సంక్రమణ పూజలు నిర్వహించారు. సూర్యుడు సంవత్సర కాలంలో 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటాడు. కాగా.. ఆదివారం వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆలయంలో మిథున సంక్రమణ పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం మేలుకొలుపు, నిత్య ఆరాధనలు పూర్తయిన తర్వాత మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, కల్యాణం, ఒగ్గు పూజారులచే పెద్ద పట్నం తదితర కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఉపప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి, అర్చక సిబ్బంది పాల్గొన్నట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు.