విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. మెట్ట భూముల్లో కూరగాయల పంటల సాగును ప్రారంభించారు. వరి నారు మడులను, వరి వెద పొలాలను దుక్కిచేసి సిద్ధంచేస్తున్నారు. వర్షాలు అనుకూలిస్తే విత్తనాలు విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం సాగు పరికరాల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తోంది. యంత్రాలు అందించడంలో చంద్రబాబు తన మార్క్ తంత్రం చూపెడుతన్నారని రైతులు వాపోతున్నారు. మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) పథకం కింద రాయితీపై ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్ర పరికరాలు సకాలంలో అందించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
గడువు ముగిసినా...
యంత్ర పరికరాల కోసం మే 5 నుంచి 19వ తేదీ వరకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా నుంచి 3,042 మంది దరఖాస్తు చేసుకున్నారు. మే 25 వ తేదీలోగా రైతు వాటా కింద చెల్లించాల్సిన డబ్బులు సైతం చెల్లించారు. అయితే యంత్ర పరికరాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని చెప్పినా.. ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఖరీఫ్ సీజన్కు యంత్ర పరికరాలు అందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
● యంత్ర పరికరాల కోసం జిల్లాకు రూ.4.22 కోట్లు కేటాయించారు. దరఖాస్తుల ప్రకారం యంత్రాలు అందజేయాలంటే రూ.49.13 కోట్లు అవసరం. యాంత్రీకరణ పథకం కింద ట్రాక్టర్లు, పవర్ ట్రిల్లర్స్ సీడర్, రోటావీటర్ వంటి యంత్ర పరికరాలు అందజేయాలి. అన్నింటికంటే ట్రాక్టర్ల కోసం 1237 దరఖాస్తులు వచ్చాయి. చిన్న సన్న కారు, ఎస్సీ, ఎస్టీ, మహిళ రైతులకు 50 శాతం రాయితీపై, మిగిలిన రైతులకు 40 శాతం రాయితీపై యంత్రాలు అందజేయాల్సి ఉంది. ప్రభుత్వ చర్యలు ఎస్ఎంఏఎం పథకాన్ని నీరుగార్చేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.
ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా రైతు
చేతికి అందని సాగు పరికరాలు
గతనెల 19వ తేదీతో ముగిసిన దరఖాస్తు గడువు
యంత్ర పరికరాల కోసం వచ్చిన దరఖాస్తులు 3,042
రైతు వాటా చెల్లించినా ఇవ్వని
యంత్రాలు


