విజయనగరం ఫోర్ట్: డైరెక్టర్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏరియా ఆస్పత్రులు, సీహెచ్ల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్, స్పెషలిస్టు) సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ పద్మశ్రీరాణి అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేశారు. జనరల్ సర్జరీ ఒక పోస్టుకు ఆరుగురు, సీఎస్ జనరల్ నాలుగు పోస్టులకు 29 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పెథాలజీ–1పోస్టు, ఈఎన్టీ–1, రేడియాలజీ–3, ఆప్తమాలజీ–1 పోస్టుకు అభ్యర్థులు ఎవరూ హాజరుకాలేదు.
వచ్చేనెల 11న జాతీయ లోక్అదాలత్
విజయనగరం లీగల్: వచ్చేనెల 11న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. పూల్బాగ్కాలనీలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ పడదగ్గ క్రిమినల్, ఎకై ్సజ్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎ.కృష్ణప్రసాద్, విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ రాఘవులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
‘ఈ డార్’ నిర్వహణలో గుర్ల టాప్..
గుర్ల: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు పరిహారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ డార్ ( ఎలక్ట్రానిక్ డీటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్) పోర్టల్ నిర్వహణలో గుర్ల పోలీస్స్టేషన్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాద బాధితుల వివరాలను ఈ పోర్టల్లో సక్రమంగా నమోదు చేస్తే ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం త్వరగా అందుతుంది. ఈ విషయంలో కానిస్టేబుల్ మురళి చురుగ్గా వ్యవహరిస్తూ, పోర్టల్ నిర్వహణను సక్రమంగా చేపట్టడంతో గుర్ల పోలీస్స్టేషన్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో ఎస్పీ ఏఆర్ దామోదర్ కానిస్టేబుల్ మురళిని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్సై నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.


