● ఇంట్లో చొరబడి గంటల తరబడి తిష్ఠ
● అటవీశాఖ చొరవతో పట్టుకున్న స్నేక్క్యాచర్స్
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని వత్తాడ గ్రామంలో బుధవారం కింగ్ కోబ్రా(గిరినాగు) ఆందోళన సృష్టించింది. ఈమేరకు గ్రామానికి చెందిన ఆలుగు పొట్టిందొర బుధవారం ఉదయం నిద్రలేచిన కొద్దిసేపటికి శబ్దం వినిపించగా బీరువావైపు చూడడడంతో ఏ సమయంలో దూరిందోగానీ బీరువాపై భాగంలో కింగ్ కోబ్రా ముడుచుకుని (చుట్టుకుని) కనిపించింది. దీంతో భయాందోళన చెందిన పొట్టిందొర కుటుంబీకులతో పాటు బయటికి వచ్చి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో..పాముకు ఎటువంటి హాని చేయకుండా స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. స్పందించిన అటవీశాఖ అధికారులు వత్తాడ గ్రామానికి వెళ్లి కింగ్కోబ్రాగా గుర్తించి..స్నేక్క్యాచర్స్కు సమాచారం అందించారు. విశాఖపట్నం నుంచి వత్తాడ గ్రామానికి మధ్యాహ్నం చేరుకున్న స్నేక్ క్యాచర్స్ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంతలో కింగ్కోబ్రా తన నోట్లోంచి మరో చచ్చిన పాము (జెర్రిపాము)ను బయటకు కక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కింగ్ కోబ్రా మరోపామును అమాంతం మింగడం వల్లనే ఎవరికీ హాని చేయకుండా బీరువాపై తనంతటతాను చుట్టుకుని ఉండిపోయిందని, లేకుంటే పెనుప్రమాదమే జరిగుండేదంటూ స్థానికులంతా వాపోయారు. కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్క్యాచర్స్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


