శృంగవరపుకోట: జిందాల్ భూముల సేకరణ వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై విచారణకు హాజరు కావాలని ఎస్టీ కమిషన్ నుంచి జిల్లా అధికారులకు సమన్లు అందినట్లు ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొడ్డవరలోని తన నివాసంలో మాట్లాడుతూ హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్హౌస్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నేతృత్వంలో జరగనున్న విచారణకు తాను హాజరవుతున్నట్లు చెప్పారు. గతంలో నాలుగు దఫాలు విచారణకు షెడ్యూల్ జారీ చేసినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు గైర్హాజరు కావడం వల్ల విచారణ జరగలేదన్నారు. జిల్లా అధికారుల గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన కమిషన్ ఈ దఫా కచ్చితంగా హాజరు కావాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ దఫా విచారణలో వాస్తవాలు వెలుగు చూసి నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వాసితుల పోరాటానికి స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, మార్చి 30న వాయిదా పడిన ఎస్టీ కమిషన్ పర్యటనను త్వరలోనే పునరుద్ధరించాలని, కమిషన్ స్వయంగా బాధిత ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి వాస్తవాలను వెల్లడించాలని ఆయన కోరారు. అధికారులు కమిషన్ ఎదుట వాస్తవాలు మాట్లాడితే నినర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


