విజయనగరం గంటస్తంభం: గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, షాపు ఉద్యోగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సీపీఎం నేత రెడ్డి శ్రీరామమూర్తి ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. రెడ్డి శ్రీరామమూర్తి 5వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రీరామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయన మరణం ఉమ్మడి జిల్లా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ గిరిజనులు, కార్మికులు, షాపు ఎంప్లాయీస్ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు. కురుపాం నియోజకవర్గంలో సీపీఎం విజయంలో ఆయన పాత్ర విశేషమని గుర్తచేశారు. వ్యవసాయ కార్మిక, గిరిజన, కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి చివరి రక్తబొట్టు వరకు ప్రజల కోసం అంకితభావంతో పని చేశారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.జగన్మోహనరావు, రాము, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


