జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు వంద రోజుల కార్యక్రమం నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ముందుస్తు గుర్తింపు సమయానికి చికిత్స, పర్యవేక్షణ చాలా ప్రధానమన్నారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనుమానిత రోగులను గుర్తించి వారికి తక్షణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. క్షయవ్యాధిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, ఆలసట, బరువు తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి తదితర లక్షణాలు ఉంటే సమీపంలోని ప్రభుత్వాస్పత్రిని సంప్రదించాలన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రాణి, డీఐఓ అచ్యుతకుమారి, తదితరులు పాల్గొన్నారు.


