● కలెక్టర్ రాంసుందర్రెడ్డి
విజయనగరం: జనాభా గణన–2027 రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో బ్లాకుల వారీగా గృహాల లెక్కింపు చేపడతామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రెండవ దశలో జనాభా గణన వచ్చే ఏడాదిలో జరుగుతుందన్నారు. కలెక్టరేట్ ఎన్నికల కంట్రోల్ రూమ్లో ముఖ్య ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి శిక్షకులకు జనగణనపై సోమవారం శిక్షణ ఇచ్చారు. గతంలో జనాభా లెక్కింపు మాన్యువల్గా జరిగేదని, ఈ సారి అంతా ఎలక్ట్రానిక్ విధానంలోనే జరుగుతుందన్నారు. మొదటి దశలో గృహాల లెక్కింపు జరుగుతుందని, జనగణనకు సంబంధించి నిబంధనలు, పద్ధతులను పాటిస్తూ తప్పులు జరగకుండా చేపట్టాలన్నారు. ఎన్యూమరే టర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఉంటుందని, అన్ని స్థాయిల్లో శిక్షణ సజావుగా జరగాలన్నారు. సీపీఓ బాలాజీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇది 8వ జనాభా లెక్కింపు కార్యక్రమమని, బ్రిటిష్ కాలంలో మొదటగా 1881లో జనాభా లెక్కింపు జరిగిందని తెలిపారు. కోవిడ్ కారణంగా అప్పుడు జరగాల్సినవి ఇప్పుడు జరుగుతున్నాయని, ఇక్కడ శిక్షణ పొందిన వారు క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, డిగ్రీ కళాశాల లెక్చరర్, టీఓటీ డాక్టర్ వి.రాఘవస్వామి, మున్సిపల్, మండల స్థాయి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


