రాజాం సిటీ: తాగునీటి కోసం రెండేళ్లుగా అల్లాడుతున్నాం.. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించిన ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు నాలుగు నెలల్లోనే అలంకార ప్రాయంగా మారింది.. తాగునీటి కష్టాలు యథాతథమయ్యాయి... తక్షణమే తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలంటూ రాజాం మండలంలోని అంతకాపల్లి, మొగిలివలస గ్రామస్తులు సోమవారం ఆందోళన చేశారు. రాజాం–శ్రీకాకుళం రోడ్డులో బారికేడ్లు అడ్డంగా పెట్టి రోడ్డు నిర్బంధించారు. తాగునీటి సదుపాయం కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై నినదించారు. బిందెడు నీరు సరఫరా చేసి గొంతు తడపాలని డిమాండ్ చేశారు. రెండు గ్రామాల ప్రజల ఆందోళనతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకులను చెదరగొట్టారు.
విషయం తెలుసుకున్న మహిళలు యువకులకు తోడుగా రోడ్డుపైకి ఖాళీ బిందెలతో చేరి ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటలు తాగనీరు సరఫరా అయ్యేదని, రాజాం రోడ్డు విస్తరణలో భాగంగా మరమ్మతులకు గురైన పైపులైన్ను అధికారులు బాగుచేయకుండా వదిలేశారని, దీంతో తాగునీటి సమస్య మరింత తీవ్రతరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి తాగునీరు యథావిధిగా సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


