● కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి
● పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు పోటెత్తిన అర్జీదారులు
విజయనగరం కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు రాగా.. అధికారులు 233 వినతులు స్వీకరించారు. ఇందులో 130 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందరరెడ్డి మాట్లాడుతూ.. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 130 వినతులు రాగా..డీఆర్డీఏ –13, పంచాయతీరాజ్ – 20, మున్సిపల్–9, విద్యుత్ శాఖ–7, హౌసింగ్–3, డీసీహెచ్ఎస్–1, గ్రామ సచివాలయ శాఖ–6, విద్య శాఖ–2, ఇతర శాఖలకు సంబంధించి 42 వినతులు వచ్చాయన్నారు.
డిజిటల్ పర్యవేక్షణ..
పీజీఆర్ఎస్ కార్యక్రమంపై డిజిటల్ పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిన కాల్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అర్జీదారునితో మాట్లాడిన తేది, సమయం కూడా వారికిచ్చే రిపోర్ట్లో నమోదు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతి, సీపీఓ బాలాజీ, విజయనగరం, చీపురుపలి, బొబ్బిలి ఆర్డీఓలు, జిల్లా సర్వే శాఖ ఎ.డి. ఆర్.విజయకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీని
వాస్ పాణి, హౌసింగ్ పీడీ మురళీధర్, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, మార్క్ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ జీవనరాణి, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ బీవీ సత్యనారాయణ, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
48 ఫిర్యాదుల స్వీకరణ..
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు 48 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూతగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్, నగదు వ్యవహారాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.


