విజయనగరం రూరల్: పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ) జిల్లా సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. పట్టణంలోని ఏపీ ఎన్జీఓ భవనంలో పంచాయతీ అభివృద్ధి అధికారుల జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మంత్రి రమణ, కార్యదర్శిగా కె. శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా తాడి వెంకటరావు.. ఉపాధ్యక్షులుగా ఎం.జగదీష్, సీహెచ్ ప్రసాద్, ఎ. ప్రవీణ్కుమార్, ఎస్.సురేష్, బి.భవానీ.. సంయుక్త కార్యదర్శులుగా ఎస్.హేమాంజలి, పి. రాంబాబు, కె. వెంకటరావు, ఎ. ముజీబ్, టి. రజని.. కోశాధికారిగా వి. శ్రీనివాస్.. కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.స్వామినాయుడు.. గౌరవ అధ్యక్షుడిగా యర్ర రమణలతో పాటు 8 మంది సభ్యులు ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన సలహాదారుగా అచ్యుతరావు, న్యాయ సలహాదారునిగా పప్పు త్రినాథ్ ఎన్నికై నట్లు ఏపీ ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరావు తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా ఎం. శ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలకుడిగా కె. చంద్రశేఖర్ వ్యవహరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎ. సురేష్ మాట్లాడుతూ.. పీడీఓల సమస్యలపై పోరాటం చేయడానికి ఏపీ ఎన్జీఓ అండగా ఉంటుందన్నారు. వన్ పీడీఓ – వన్ యూనియన్ నినాదంతో సభ్యులందరూ ఏకమై సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని తీర్మానించారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 300 పైగా పీడీఓలు హాజరయ్యారు.


