విజయనగరం క్రైమ్: రచనలతో వాడుక భాషకు కవయిత్రి మొల్ల వన్నె తెచ్చారని విజయనగరం అడిషనల్ సూపరింటెండెంట్ సౌమ్యలత అన్నారు. కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో డీపీఓలో శుక్రవారం నిర్వహించారు. మొల్లమాంబ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సౌమ్యలత మాట్లాడుతూ 16వ శతాబ్దానికి చెందిన ఆతుకూరి మొల్లమాంబ తెలుగు కవయిత్రిగా కీర్తి గడించారన్నారు. వాజ్మయ మూలాల ఆధారంగా స్వతంత్ర భావాలతో సరళమైన వాడుక భాషలో సామాన్యులకు, పామరులకు అర్థమయ్యే శైలిలో రచనలు చేశారన్నారు. సంస్కృత భాషలోని రామాయణాన్ని ప్రప్రథమంగా తెలుగులోకి అనువదించిన మహిళగా మొల్లమాంబ ఘనత సాధించారన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్ కుమార్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


