● ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి
● రేపు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
పాలకొండ రూరల్: ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రజా మన్ననలు పొందిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. పాలవలస స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ద్వారా తన పాలనలో రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమం ఏ ఒక్కరూ మరువలేరని గుర్తు చేశారు. అదే సమయంలో అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించారన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగిందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకుని ఈ నెల 12న 16వ వసంతంలోకి అడుగిడుతుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రం పాలకొండలోని వైఎస్సార్ కూడలి వద్ద గురువారం ఉదయం 10 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఘన నివాళులర్పించనున్నట్టు తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ స్ఫూర్తిని ఘనంగా చాటాలని కోరారు. తద్వారా ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ద్వారా పునరంకితం అవుదామని అన్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్రజల మద్దతు కూడగడదామన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ మన పార్టీయే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.


