● అభినందించిన జిల్లా పౌరవేదిక
విజయనగరం గంటస్తంభం: శాసనమండలి సమావేశాల్లో జిల్లాకు సంబంధించిన కీలకమైన ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డా.పెనుమత్స సురేష్బాబు ప్రస్తావించడం శుభసూచికమని, ప్రజా సమస్యలే తన గళంగా వినిపించడం అభినందనీయమని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ అతిథిగృహంలో పౌర వేదిక ప్రతినిధులు ఎమ్మెల్సీ సురేష్బాబును మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో కేన్సర్ బాధితుల సంఖ్య అధికంగా ఉండడంతో విజయనగరంలో ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సురేష్బాబు మండలిలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి మెడికల్ కళాశాలకు తరలించాలని కోరడం సముచితమని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీరు, సాగునీరు సమస్యలు, మూతపడిన భీమసింగి సుగర్స్ పునరుద్ధరణ, యువత ఉపాధి, రైతు సమస్యలపై అధికార పార్టీ నేతలు శాసనసభలో స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పౌర వేదిక నేతలు జలంత్రి రామచంద్రరాజు, దవడ కొండబాబు, పట్నాల శ్రీనివాస్, అల్లంశెట్టి నాగభూషణం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


